Begin typing your search above and press return to search.

పోస్కోను ఒరిస్సా తంతే... ఆంధ్రాలో ప‌డ్డారు.. ఇదేనా ఆంధ్రుల పౌరుషం!

By:  Tupaki Desk   |   13 March 2021 10:01 AM GMT
పోస్కోను ఒరిస్సా తంతే... ఆంధ్రాలో ప‌డ్డారు.. ఇదేనా ఆంధ్రుల పౌరుషం!
X
కేంద్ర ప్ర‌భుత్వం అమ్మ‌కానికి పెట్టేస్తామ‌ని గ‌ట్టిగా చెబుతున్న ఆంధ్రుల హ‌క్కు.. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను కొనేందుకు పోస్కో సిద్ధంగా ఉంద‌ని కొన్నాళ్లుగా క‌థ‌నాలు వ‌స్తున్నాయి. పోస్కోసంస్థ కొరియాకు చెందిన కంపెనీ. ఇక‌, ఈ కంపెనీ నేప‌థ్యంలో తెలుసుకుంటే. ఒకింత ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు.. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌భుత్వాల‌ను మేనేజ్ చేయ‌డం, ముడుపులు ఆశ చూప‌డం, ఆయా దేశాల్లో ఉక్కు ప‌రిశ్ర‌మ‌ల‌ను కారు చౌక‌గా కొట్టేయ‌డం. ఇదీ.. ఈ కంపెనీ మేన‌రిజ‌మ‌ని ఎవ‌రిని అడిగినా చెబుతారు. ప్ర‌స్తుతం ఏపీ పై క‌న్నేసిన ఈ పోస్కో.. విశాఖ ఉక్కును చేజిక్కించుకునేందుకు అన్ని అడ్డ‌దారులు తొక్కింద‌నే వాద‌న వినిపిస్తోంది.

వాస్త‌వానికి ఏపీ క‌న్నా ముందుగా.. ఈ పోస్కో కంపెనీ ఒరిస్సాలో అడుగు పెట్టింది. అక్క‌డి ఉక్కు ఫ్యాక్టరీ పై క‌న్నేసింది. అయితే... అక్క‌డ జ‌నాలు అంద‌రూ ఏక‌తాటి పైకి వ‌చ్చి.. త‌రిమి కొట్టారు. అక్క‌డ ఉన్న బ‌ల‌మైన సీఎంఎం, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను జాగృతం చేసి.. పోస్కో క‌ధ క‌ట్టించారు. మ‌రి ఏపీలో మాత్రం ఇటు అధికార ప‌క్షం, అటు ప్ర‌తిపక్షాలు ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తి పోసుకుంటున్నారే త‌ప్ప‌.. కేంద్రంలోని మోడీ స‌ర్కారును మాత్రం ప‌న్నెత్తు మాట అన‌డం లేదు. ఇది విశాఖ ఉక్కుకు మ‌రింత తీవ్ర ప‌రిణామంగా మారింది.

ప్ర‌స్తుతం విశాఖ ఉక్కు విష‌యాన్ని కూడా త‌మ స్వార్థ రాజ‌కీయాల కోణంలోనే అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లు చూస్తున్నారు త‌ప్ప‌.. విశాల జ‌న‌హితాన్ని మాత్రం వారు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ ప‌రిణామం.. దాదాపు 50 వేల మంది ఉద్యోగులు త‌మ ఉద్యోగాలు కోల్పోయే దారుణ ప‌రిస్థితిని తీసుకువ‌స్తోంది. దీంతో ల‌క్ష‌ల మంది కుటుంబ స‌భ్యులు రోడ్డున ప‌డ‌డం కూడా ఖాయంగా క‌నిపిస్తోంది. పోస్కో కంపెనీ.. ఆటో మేష‌న్‌లో త‌క్కువ కార్మికుల‌తో ప‌ని చేయించుకుని దేశ సంప‌ద కొట్టేయాల‌ని చూస్తుంటే.. ప్ర‌జ‌ల క‌డుపులు ర‌గిలిపోతున్నాయి. దీంతో వారు తిర‌గ‌బ‌డుతున్నారు.

ఈ స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలిచి.. వారి ప‌క్షాన గ‌ళం వినిపించాల్సిన రాజ‌కీయ పార్టీలు మాత్రం.. ఓట్ల కోసం .. సీట్ల కోసం.. మాత్ర‌మే.. లెక్క‌లు వేసుకుంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి పొరుగున ఉన్న త‌మిళ‌నాడులోనూ ఏదైనా రాష్ట్రం మొత్తానికి స‌మ‌స్య వ‌స్తే.. అది రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించింది అయితే.. అక్క‌డి ప్ర‌తిప‌క్షాలు.. రాజ‌కీయాల‌కు అతీతంగా స్పందించి.. ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునేందుకు న‌డుం బిగిస్తాయి. కానీ.. ఏపీలో మాత్రం నేత‌ల మ‌ధ్య ఐక్య‌త లేదని, రాష్ట్ర హితం వీరికి ప‌ట్ట‌ద‌ని, కేవ‌లం వీరికి రాజ‌కీయ ఓటు బ్యాంకు, ప్ర‌జ‌ల నుంచి ఓట్లు మాత్ర‌మే కావాల‌ని.. తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇప్ప‌టికైనా నాయ‌కులు.. పార్టీలు మార‌తారో లేదో చూడాలి..