Begin typing your search above and press return to search.

పొంగులేటి కంటే పాడి గొప్పనా?

By:  Tupaki Desk   |   17 Nov 2021 8:58 AM IST
పొంగులేటి కంటే పాడి గొప్పనా?
X
తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్‌లో ఇప్పుడు స‌రికొత్త లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. తాజాగా శాస‌న మండ‌లిలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల భ‌ర్తీ కోసం టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌య‌మే ఇందుకు కార‌ణంగా నిలుస్తోంద‌ని కూడా చెప్ప‌క తప్ప‌దు. ఎమ్మెల్సీ స్థానాల కోసం కేసీఆర్ ఎంపిక చేసిన నేత‌ల పేర్ల‌తో కొంద‌రు నేత‌ల్లో అసంతృప్తి పెల్లుకుబుతోంది.

ఇలాంటి నేత‌ల అనుచ‌ర వ‌ర్గం అయితే పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యంపై ర‌గిలిపోతున్నార‌ని చెప్పక తప్ప‌దు మిగిలిన వారి ప‌రిస్థితి ఏమిటో తెలియ‌దు గానీ.. ఖ‌మ్మం జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌, జిల్లా వ్యాప్తంగా మంచి ప‌లుకుబ‌డి క‌లిగిన నేత‌గా, తెలంగాణ‌ను సాధించిన పార్టీగా టీఆర్ఎస్ వైపు వీచిన బ‌ల‌మైన గాలిలోనూ, ప్ర‌త్యేక తెలంగాణ‌ను వ్య‌తిరేకించిన పార్టీగా ముద్ర ప‌డిపోయిన వైసీపీ టికెట్‌పై బ‌రిలోకి దిగి ఎంపీగా గెలిచి స‌త్తా చాటిన పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి అయితే తీవ్ర‌ అసంతృప్తితో ఉన్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇక పొంగులేటి అనుచ‌ర వ‌ర్గం అయితే ఏకంగా ర‌గిలిపోతున్నార‌ని చెప్ప‌డం కూడా త‌క్కువేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఖాళీ అయిన శాస‌న‌మండ‌లి స్థానాల‌ను భ‌ర్తీ చేసే క్ర‌మంలో టీఆర్ఎస్ అధినేత హోదాలో సీఎం కేసీఆర్ సోమ‌వారం నాడు ఐదుగురు నేత‌ల పేర్ల‌ను ప్ర‌క‌టించారు. వారిలో మిగిలిన న‌లుగురి విష‌యంలో అంత‌గా ప‌ట్టింపు లేకున్నా.. క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌విని క‌ట్ట‌బెడుతూ కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యంపై పొంగులేటి వ‌ర్గం మండిప‌డుతోంది. హుజూర‌బాద్ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ నేత‌గా సాగుతున్న కౌశిక్ రెడ్డి.. మాజీ మంత్రి ఈటల రాజేంద‌ర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన నేప‌థ్యంలో త‌న‌దైన శైలి రాజ‌కీయానికి తెర తీసి అంద‌రినీ ఆశ్చర్య‌ప‌రిచార‌నే చెప్పాలి.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని తానేన‌ని చెప్పుకున్న కౌశిక్ రెడ్డి.. హ‌స్తం పార్టీకి దెబ్బ కొడుతూ టీఆర్ఎస్‌కు స‌హ‌క‌రించారు. విష‌యం ముందుగానే బ‌య‌ట‌ప‌డిపోవ‌డంతో కాంగ్రెస్ పార్టీ వేటు వేయ‌డంతో కౌశిక్ రెడ్డి నేరుగా వెళ్లి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అయితే బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన వారికి టికెట్ ఇవ్వాల‌న్న కేసీఆర్ నిర్ణ‌యం కౌశిక్ రెడ్దికి మ‌రింత‌గా క‌లిసి వ‌చ్చింద‌ని చెప్పాలి. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌కు టీఆర్ఎస్ టికెట్ ద‌క్క‌గా.. టీఆర్ఎస్‌కు భారీ ల‌బ్ధి చేకూక‌ర్చేలా వ్య‌వ‌హ‌రించిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వ‌క త‌ప్ప‌లేదు. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఇచ్చిన ఎమ్మెల్సీ అలా పెండింగ్ లో ఉండ‌గా.. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ప‌ద‌విని కూడా కౌశిక్ దక్కించుకున్నారు.

పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ద‌క్కిన వైనంపై ఇప్పుడు పార్టీలో భిన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కౌశిక్ రెడ్ది కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచినా.. హుజూరాబాద్ లో టీఆర్ఎస్‌కు ఒరిగిందేమీ లేద‌ని, బీజేపీ చేతిలో పార్టీ ఘోర ప‌రాజ‌యం చూడాల్సి వ‌చ్చింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో కౌశిక్ రెడ్డికి మ‌రీ అంత‌గా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్న వాద‌న‌లు పార్టీ శ్రేణుల్లో ఓ రేంజిలో వినిపిస్తున్నాయి. ఇదే విష‌యాన్ని ప్ర‌తిసారీ అవ‌కాశాలు ద‌క్క‌క అసంతృప్తిని పంటి బిగువున కప్పి పెట్టుకుంటున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సారి మాత్రం దానిని వెళ్లగ‌క్కేశార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

పొంగులేటి ఇప్ప‌టిదాకా పెద‌వి విప్ప‌కున్నా.. ఆయ‌న అనుచ‌ర వ‌ర్గం మాత్రం పార్టీ నిర్ణ‌యంపై తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నార‌నే చెప్పాలి. క‌నీసం ఓ మండ‌ల స్థాయి నేతకూ సాటి రాని కౌశిక్ రెడ్డికి ప‌దవి క‌ట్ట‌బెట్టిన కేసీఆర్‌కు.. ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా మంచి ప‌ట్టు క‌లిగిన పొంగులేటి క‌నిపించ‌లేదా? అంటూ ఆయ‌న అనుచ‌రులు వాదిస్తున్నారు. అంతేకాకుండా త‌న‌తో పాటు వైసీపీ త‌ర‌ఫున గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల‌తో పార్టీలోకి వ‌చ్చిన పొంగులేటికి కేసీఆర్ ఏమిచ్చార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

2019 ఎన్నిక‌ల్లో క‌నీసం ఎంపీ టికెట్ ను కూడా ఇవ్వ‌ని కేసీఆర్‌.. నామా నాగేశ్వ‌ర‌రావుకు ఆ టికెట్ ఇచ్చి.. భ‌విష్య‌త్తులో మంచి ప‌ద‌వులు క‌ట్ట‌బెడ‌తామ‌ని పొంగులేటికి స‌ర్ది చెప్పిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా వారు గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఎప్ప‌టిక‌ప్పుడు పొంగులేటిని ప‌క్క‌న‌బెడుతూ వ‌స్తున్న కేసీఆర్‌.. ఈ ద‌ఫా కూడా త‌మ నేత‌ను విస్మ‌రించి.. ఓ మండ‌ల స్థాయి నేత కూడా కాని కౌశిక్ రెడ్డికి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌ని ఆరోపిస్తున్నారు. ఈ లెక్క‌న కౌశిక్ రెడ్డి కంటే కూడా త‌మ నేత తీసిపోయారా? అని వారు ప్రశ్నిస్తున్నారు.