Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ లో 'పొంగు' తున్న అసమ్మతి..

By:  Tupaki Desk   |   12 Sep 2018 10:09 AM GMT
టీఆర్ ఎస్ లో పొంగు తున్న అసమ్మతి..
X
తెలంగాణలో ఎన్నికలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే అలకలు - అసమ్మతులు మొదలయ్యాయి. అధికార టీఆర్ ఎస్ లో ఆదిపత్య పోరు ఇప్పుడా పార్టీని కలవరపెడుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ ఎస్ లో చేరిన ఖమ్మం వైసీపీ ప్రజాప్రతినిధుల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు పొడచూపాయట.. ఈ పరిణామాలు టీఆర్ ఎస్ లో గుబులు రేపుతున్నాయి.

ఈసారి ఖమ్మంలో మెజార్టీ సీట్లు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్న టీఆర్ ఎస్ కు ఆ జిల్లాలోని గ్రూపు రాజకీయాలు సమస్యగా మారాయట.. ఈ గ్రూపులు కూడా వైసీపీ నుంచి టీఆర్ ఎస్ లో చేరిన వారి మధ్యే ఉండడంతో టీఆర్ ఎస్ అధిష్టానం తలపట్టుకుంటోందట..

2014లో ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలిచారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆ తర్వాత ఆయన టీఆర్ ఎస్ లో చేరిపోయారు. తనతోపాటు వైసీపీ ఎమ్మెల్యేలను కూడా పొంగులేటి కారెక్కించారు. టీఆర్ ఎస్ లో చేరేంత వరకూ కలిసికట్టుగా ఉన్న వీరంతా ఆ తర్వాత ఎవరికీ వారే గ్రూపు రాజకీయాలకు తెరతీశారట.. సత్తుపల్లి నుంచి టీఆర్ ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా పిడమర్తి రవికి టికెట్ కేటాయించింది. కానీ గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచారు దయానంద్. పొంగులేటి వర్గంలో కొనసాగుతున్న దయానంద్.. ఇప్పుడు సత్తుపల్లి టికెట్ తనకే కావాలని.. పిడమర్తి రవికి సహకరించే ప్రసక్తే లేదని తిరుగుబావుటా ఎగురవేశారట.. సొంతం పోటీచేసేందుకు రెడీ అవుతూ ప్రచారం కూడా చేస్తున్నారట..

ఇక వైరా నియోజకవర్గం నుంచి తాజా మాజీ మదన్ లాల్ నే టీఆర్ ఎస్ తమ అభ్యర్థిగా ప్రకటించారు. వైసీపీ నుంచి గెలిచి టీఆర్ ఎస్ లో చేరిన మదన్ లాల్ ఇప్పుడు మంత్రి తుమ్మల వర్గంలో ఉన్నారు. మదన్ లాల్ కు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఎంపీ పొంగులేటి ఆ నియోజకవర్గంలోని 20 మంది సర్పంచ్ - ఎంపీటీసీలతో రాజీనామాలు చేయించి మదన్ లాల్ కు టికెట్ ఇస్తే ఓడిస్తామని తిరుగుబాటు చేయించారని వార్తలు వెలువడుతున్నాయి. .. దీని వెనుక పొంగులేటి ఉన్నాడని తుమ్మల వర్గం అనుమానిస్తోంది. ఇక కొత్తగూడెం టీఆర్ ఎస్ అభ్యర్థిగా జలగంకు టికెట్ ఇవ్వడంపైన కూడా పొంగులేటి వర్గం వ్యతిరేకిస్తోందట.. మొత్తం మీద టీఆర్ ఎస్ లో ఇప్పుడు పొంగులేటి గ్రూపు రాజకీయాలు ఖమ్మం పాలిటిక్స్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లా టీఆర్ ఎస్ లో ఆదిపత్య పోరు పార్టీ పుట్టి ముంచేలా ఉందని టీఆర్ ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారట..