Begin typing your search above and press return to search.

5 రాష్ట్రాలు.. పోలింగ్ శాతం ఎక్కడ తక్కువ.?

By:  Tupaki Desk   |   8 Dec 2018 7:10 AM GMT
5 రాష్ట్రాలు.. పోలింగ్ శాతం ఎక్కడ తక్కువ.?
X
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. చివరి విడతలో నిన్న 7న తెలంగాణ - రాజస్తాన్ రాష్ట్రంలో పోలింగ్ జరిగింది. తెలంగాణలో 69.1శాతం ఓటింగ్ నమోదు కాగా.. రాజస్తాన్ లో 74.02శాతం ఓటింగ్ నమోదైంది. తెలంగాణ కంటే రాజస్థాన్ లోనే పోలింగ్ ఎక్కువగా నమోదుకావడం విశేషంగా చెప్పవచ్చు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కారణంగానే రాజస్థాన్ లో ఓటింగ్ శాతం పెరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పటికే ముగిసిన చత్తీస్ ఘడ్ లో 70శాతం పోలింగ్ నమోదు కాగా.. మధ్యప్రదేశ్ లో 75శాతం - మిజోరంలో 75శాతం పోలింగ్ నమోదైంది. ఈ లెక్కన తెలంగాణలోనే 69శాతం తక్కువ నమోదైందని అర్థమవుతోంది. తెలంగాణలో ఓటింగ్ శాతం తగ్గడానికి హైదరాబాద్ లో ఉన్న బద్దకపు ఓటర్లే కారణంగా కనిపిస్తోంది.

ఇటీవలే ముగిసిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు 199 సీట్లకు మాత్రమే పోలింగ్ నిర్వహించారు. బీఎస్పీ అభ్యర్థి లక్ష్మన్ సింగ్ హఠాన్మరణంతో రామ్ గఢ్ నియోజకవర్గం ఎన్నిక నిలిచిపోయింది.

రాజస్థాన్ లోని సుమారు 4.74 కోట్ల ఓటర్ల కోసం 51687 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. స్వల్ప ఘటనలు మినహా అక్కడ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిపోయింది. రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే - రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ గెలుపుపై ధీమాగా ఉన్నారు. వసుంధర రాజేపై కాంగ్రెస్ పార్టీ బీజేపీ కురువృద్ధుడు జస్వంత్ సింగ్ కుమారుడు మాన్వేంద్రసింగ్ ను కాంగ్రెస్ లోకి రప్పించి బరిలోకి దింపి గట్టిపోటీనిస్తోంది.. ఇక సచిన్ పైలెట్ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న టోంక్ స్థానం నుంచి పోటీచేస్తుండగా.. ఆయనపై బీజేపీ ఏకైక ముస్లిం మంత్రి యూనస్ ఖాన్ ను బరిలోకి దింపింది.

ప్రస్తుతం రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీకి 160 - కాంగ్రెస్ కు 25 మంది సభ్యుల బలం ఉంది. తాజా ఎన్నికల ఫలితాలు 11న వెలువడుతాయి. మరి రాజస్థాన్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారన్నది తెలియాలంటే 11 వరకూ ఆగాల్సిందే..