Begin typing your search above and press return to search.

సామాన్యుడి గెలుపు క్రెడిట్ పీకేతో పాటు ఆమెకూ ఇవ్వాలి

By:  Tupaki Desk   |   12 Feb 2020 5:45 AM GMT
సామాన్యుడి గెలుపు క్రెడిట్ పీకేతో పాటు ఆమెకూ ఇవ్వాలి
X
ఢిల్లీ పీఠాన్ని సామాన్యుడు మరోసారి సొంతం చేసుకున్నాడు. ఆయన గెలుపు మోడీని వ్యతిరేకించే వారందరికి పండుగ చేసుకునేలా చేసింది. మోడీ స్పీడ్ ను తట్టుకోవటం కష్టమైన వేళ.. ఆ పార్టీలోని వారంతా విపరీతంగా ప్రయత్నించినప్పటికీ ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవటంలో ఫెయిల్ అయ్యారు. ఢిల్లీలో కేజ్రీవాల్ గెలిచినంతనే ఆయన విజయంలో క్రెడిట్ ను పీకే కు కట్టబెట్టేశారు పలువురు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే తో పాటు.. ఆయన కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని భుజానెత్తుకున్న కేజ్రీవాల్ కుమార్తె ను చాలామంది మర్చి పోవటం కనిపిస్తుంది.

వాస్తవానికి పీకే కంటే ముందుగా.. పక్కా ప్లాన్ తో ఆమె వేసిన ఎత్తులు కూడా ఈ రోజు సామాన్యుడి అసమాన్యమైన విజయానికి కారణంగా చెప్పక తప్పదు. కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ఢిల్లీ ఐఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఒక పెద్ద కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగి గా పని చేస్తున్నారు. తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న భావన లేకుండా అందరితో కలిసి పోయే గుణం ఆమె లో ఎక్కువే.

ఎన్నికలకు ఐదు నెలల ముందే జాబ్ కు లీవ్ పెట్టేసి.. ఆప్ పార్టీ ప్రచారంలోకి దిగారు. తన తండ్రి గెలుపు కోసం ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాల్ని సిద్ధం చేయటంతో పాటు.. వీధుల్లోకి వచ్చి తండ్రి తరఫున ప్రచారాన్ని భారీగా చేపట్టింది. సోషల్ మీడియాలో ప్రత్యర్థులకు చెక్ పెడుతూ.. ఓటర్ల లో తమపై నమ్మకాన్ని పెంచుకునేలా చేసింది. గతంతో పోలిస్తే.. ఈసారి ప్రచారం పోటా పోటీగా సాగింది. బీజేపీ తో జరిపిన ప్రచార యుద్ధంలో తన అధిక్యతను హర్షిత ప్రదర్శించిందని చెప్పాలి.

ప్రత్యర్థులకు ధీటుగా ప్రచారాన్ని మొదలు పెట్టిన ఆమెకు ప్రశాంత్ కిశోర్ టీం తోడైంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీ విజయం సాధించిన వెంటనే.. ఆ క్రెడిట్ ను పీకే ఖాతాలో వేశారే కానీ.. కేజ్రీవాల్ కుమార్తె పడిన కష్టాన్ని చాలామంది పట్టించుకోలేదు. అయితే.. ఢిల్లీ ఎన్నికల్లో సామాన్యుడి గెలుపు వెనుక హర్షితకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.