Begin typing your search above and press return to search.

7 ఉప ఎన్నికలు.. గెలిచిన పార్టీలివే!

By:  Tupaki Desk   |   7 Nov 2022 5:30 AM GMT
7 ఉప ఎన్నికలు.. గెలిచిన పార్టీలివే!
X
దేశవ్యాప్తంగా 7 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు హవా చెలాయించాయి.

తెలంగాణలోని మునుగోడులో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిపై 10 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. మద్యం, మాంసం, మనీ పంపిణీలో దేశంలోనే మునుగోడు ఉప ఎన్నిక రికార్డు సృష్టించింది. ఊరికో ఎమ్మెల్యేని, మండలానికో ముగ్గురు మంత్రుల చొప్పున బరిలోకి దించిన అధికార టీఆర్‌ఎస్‌ గెలుపు రుచి చవిచూసింది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున బరిలోకి దిగిన పాల్వాయి స్రవంతికి డిపాజిట్‌ రాలేదు.

ఇక మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్‌లో మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం అభ్యర్థి రుతుజ లట్కే విజయం సాధించారు. ఉద్ధవ్‌ ఠాక్రే, ఏకనాథ్‌ షిండేల మధ్య విభేదాలతో ఎన్నికల సంఘం శివేన ఎన్నికల గుర్తు అయిన విల్లు, బాణాన్ని స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి కాగడా గుర్తును కేటాయించింది. కాంగ్రెస్, ఎన్సీపీ సైతం ఉద్ధవ్‌ అభ్యర్థికే మద్దతిచ్చారు. మరోవైపు బీజేపీ, శివసేన (ఏకనాథ్‌ షిండే వర్గం) పోటీ చేయలేదు. దీంతో అందేరిలో ఎన్నిక ఏకపక్షం అయ్యింది. అందేరిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న శివసేన ఎమ్మెల్యే రమేష్‌ లట్కే మరణించడంతో ఆయన భార్య రుతుజ లట్కే బరిలోకి దిగారు. ఆమెకు 66530 ఓట్లు వచ్చాయి. నోటాకు 12,806 ఓట్లు రావడం గమనార్హం. పోటీ చేసిన ఇతర అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో శివసేన రెండు వర్గాలుగా విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక ఇదే.

హరియాణాలోని మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ కుటుంబం ప్రతిష్ఠాత్మకంగా భావించిన అదంపూర్‌ అసెంబ్లీ స్థానంలో అధికార బీజేపీ తరఫున బరిలోకి దిగిన భజన్‌లాల్‌ మనమడు భవ్య బిష్ణోయ్‌ ఘనవిజయం సాధించారు. భజన్‌లాల్‌ తనయుడు కుల్దీప్‌ బిష్ణోయ్‌ ఇటీవల కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరారు. అంతేకాకుండా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీజేపీ కుల్దీప్‌ బిష్ణోయ్‌ తనయుడు భవ్య బిష్ణోయ్‌కి సీటు ఇచ్చింది. ఆయనకు 67,462 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థికి 51,752 ఓట్లు వచ్చాయి. కాగా అదంపూర్‌ భజల్‌లాల్‌ కుటుంబానికి కంచుకోట. 1968 నుంచి అక్కడ ఆ కుటుంబానికి చెందినవారే గెలుస్తున్నారు. మాజీ సీఎం భజనల్‌లాల్‌ ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు, ఆయన సతీమణి జస్మా దేవి ఒకసారి, భజన్‌లాల్‌ కుమారుడు కుల్దీప్‌ బిష్ణోయ్‌ నాలుగుసార్లు అదంపూర్‌ నుంచి గెలుపొందారు.

ఒడిశాలోని ధామ్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార బిజూ జనతాదళ్‌కు చుక్కెదురు అయ్యింది. బిజూ జనతాదళ్‌ (బీజేడీ) అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి 9,881 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న బిష్ణు చరణ్‌ సేథి సెప్టెంబర్‌లో మరణించడంతో ఉప ఎన్నిక నిర్వహించారు. బిష్ణు చరణ్‌ సేథి తనయుడు సూర్యభన్షి సూరజ్‌కు బీజేపీ సీటు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయనకు 80,351 ఓట్లు పోలవ్వగా.. బీజేడీ అభ్యర్థి అబంటి దాస్‌కు 70,470 ఓట్లు వచ్చాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోలా గోకర్ణ్‌నాథ్‌ సీటును బీజేపీ గెలుచుకుంది. ఆ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అర్వింద్‌ గిరి మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ ఆయన తనయుడు అమన్‌గిరిని బీజేపీ బరిలో దించింది. ఆయన తమ సమీప ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన వినయ్‌ తివారీపై 34వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ, ఎస్పీ మధ్యే పోటీ నెలకొంది.

బిహార్‌లోని గోపాల్‌గంజ్, మొకామా అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ, ఆర్జేడీ గెలుపొందాయి. గోపాల్‌గంజ్‌లో బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుభాష్‌ సింగ్‌ మృతి చెందడంతో, మొకామాలో ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్‌సింగ్‌పై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికలు జరిగాయి. దీంతో ఈ రెండు స్థానాల్లో ఆయా పార్టీలు ఆ నేతల సతీమణుల్ని బరిలో దించి విజయం సాధించాయి. గోపాల్‌గంజ్‌లో సుభాష్‌ సింగ్‌ సతీమణి, బీజేపీ అభ్యర్థి కుసుమ్‌ దేవికి 70,032 ఓట్లు రావడంతో ఆమె విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి మోహన్‌ గుప్తాకు 68,243 ఓట్లు వచ్చాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.