Begin typing your search above and press return to search.

ఏపీలో రూ.72 లక్షల మద్యం నేలపాలు .. ఏమైందంటే?

By:  Tupaki Desk   |   18 July 2020 10:30 AM GMT
ఏపీలో రూ.72 లక్షల మద్యం నేలపాలు .. ఏమైందంటే?
X
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ..రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినప్పటి నుండి మద్యం పై , మద్యం అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ .. అధికారంలోకి వస్తే అక్కచెల్లెమ్మల కోసం రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేదిస్తాం అని చెప్పారు. అందులో భాగంగానే ..రాష్ట్రంలో దశల వారీగా మద్యాన్ని నిషేధించడానికి ప్లాన్ అమలు చేస్టున్నారు.

ఇందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్రంలో సుమారుగా 43 వేల బెల్ట్ షాపులు క్లోజ్ చేశారు. 20 శాతం వైన్ షాపులను తగ్గించగా.. 4500 పర్మిట్ రూమ్ ‌లను కూడా పూర్తిగా క్లోజ్ చేయించారు. లాక్ డౌన్ తర్వాత కూడా 13 శాతం మద్యం షాపులను తగ్గించేశారు. అలాగే మద్యం ధరలను ఏకంగా 75 శాతం పెంచారు. దీనితో చాలామంది మద్యం షాప్స్ వైపు చూడటానికి భయపడుతున్నారు. అయితే , ఇదే అదునుగా భావించి ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యాన్ని రాష్ట్రంలోకి తీసుకువచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటివారిపై నిఘా పెట్టిన రాష్ట్ర ఎక్సైజ్ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు.

ముఖ్యంగా ఈ లాక్ డౌన్ తర్వాత ఏపీలో మద్యం ధరలు భారీగా పెంచేయడంతో ఏపీకి దొడ్డిదారిన మద్యం తరలిస్తున్నారు. వివిధ మార్గాల్లో తరలించే మద్యాన్ని పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. అయితే ఇటీవల 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో భారీగా మద్యం పట్టుకున్నారు. ఇదంతా పొరుగున గల తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు. మద్యం తరలించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. అలాగే అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఆ మద్యాన్ని ధ్వంసం చేయాలని భావించిన అధికారులు మచిలీపట్నం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌ లో వరసగా పెట్టారు. రోడ్ రోలర్‌తో తొక్కించారు. మొత్తం 3 వేల 207 లీటర్ల మద్యం , 14 వేల బాటిళ్లను అక్రమంగా తరలిస్తుంటే పట్టుకున్నారు. దీని విలువ రూ.72 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ మందును దీనిని వీడియో తీయగా ఎఎన్ ఐ వార్తా సంస్థ వీడియోను పోస్ట్ చేసింది. తెలంగాణతో సరిహద్దు గల కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి భారీగా మద్యం తరలించారని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. చెక్ పోస్టుల వద్ద మద్యం స్వాధీనం చేసుకున్నామని వివరించారు