Begin typing your search above and press return to search.

అమరావతి రైతులకు బేడీలు... పోలీసులపై వేటు పడింది

By:  Tupaki Desk   |   28 Oct 2020 5:45 PM GMT
అమరావతి రైతులకు బేడీలు... పోలీసులపై వేటు పడింది
X
వారంతా రైతులు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమం చేస్తున్నారు. అయితే తమకు పోటీగా ఉద్యమం కొనసాగించేందుకు వస్తున్న కొందరిని వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గొడవ జరిగింది. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి. వెరసి రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతుల చేతులకు బేడీలు వేశారు. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. విషయాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన పోలీసు ఉన్నతాధికారులు... రైతుల చేతులకు బేడీలు వేసిన ఆరుగురు ఖాకీలపై వేటు వేశారు. అంతేకాకుండా ఈ ఆరుగురి అత్యుత్సాహాన్ని నిలువరించాల్సి ఉన్నా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిన మరో ఇద్దరు ఖాకీలకు తాఖీదులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... ఏపీ రాజధానిగా కొనసాగుతున్న అమరావతినే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా కొనసాగించాలని... రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు రోజుల తరబడి నిరసనలు కొనసాగిస్తున్నారు. మొన్నటిదాకా బాగానే ఉన్నా... జగన్ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతుగా అమరావతిలోనే పోటీ దీక్షలు మొదలయ్యాయి. ఈ క్రమంలో పోటీ దీక్షలకు ఆటోల్లో వెళుతున్న కొందరిని అమరావతి రైతులు అడ్డగించారు. తాము చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా దీక్షలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను పంపించేశారు. ఆ తర్వాత అమరావతి రైతులు తమను కులం పేరుతో దూషించారంటూ దళిత వర్గానికి చెందిన కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 11 మంది అమరావతి రైతులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా జైలుకు తరలించే సందర్భంగా వారి చేతులకు బేడీలు వేసి మరీ బస్సెక్కించారు. ఈ దృశ్యాలు పెను దుమారాన్నే రేపాయి.

ఈ వ్యవహారంపై విపక్షాలు ఓ రేంజిలో విరుచుకుపడ్డాయి. దీంతో గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ.... రంగంలోకి దిగి అసలు ఏం జరిగిందన్న విషయంపై సమగ్ర వివరాలు సేకరించారు. రైతుల చేతులకు బేడీలు వేయడం తప్పేనని తేల్చిన ఆయన.. అందులో అత్యుత్సాహం ప్రదర్శించిన ఆరుగురు కానిస్టేబుళ్లపై సస్సెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా రైతుల చేతులకు హెడ్ కానిస్టేబుళ్లు బేడీలు వేస్తున్నా... నిలువరించకుండా చోద్యం చేసిన ఇద్దరు రిజర్వ్ ఇన్ స్పెక్టర్, రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్ లకు చార్జీ మెమోలు జారీ చేశారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పటికే రాజకీయ రంగు పులుముకోగా... పరిస్థితి మరింత దిగజారకముందే గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ వేగంగా స్పందించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవడం గమనార్హం.