Begin typing your search above and press return to search.

40 కి.మీ నడిచి ఇంటికి చేరిన అత్యాచార బాధితురాలు... ఏమైదంటే ?

By:  Tupaki Desk   |   1 Jun 2020 10:50 AM GMT
40 కి.మీ నడిచి ఇంటికి చేరిన అత్యాచార బాధితురాలు... ఏమైదంటే ?
X
వైరస్ కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ వల్ల అనేకమంది అనేకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వలస భాదితుల కష్టాలు వర్ణనాతీతం. ఈ లాక్ డౌన్ లో తమ సొంతూళ్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో కాలినడకనే చాలామంది బయలుదేరారు. మార్గమధ్యలోనే కొందరు మృతి చెందిన ఘటనలనూ చూశాం. ఇలా కొన్ని వందల కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు చేరుకుంటున్నారు. ఇక లాక్‌ డౌన్ అమలులో ఉండటంతో ఓ 14ఏళ్ల అత్యాచార బాధితురాలు తన ఇంటికి చేరుకునేందుకు 40 కిలోమీటర్లు మేరా నడిచిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దుర్ఘటన బీహార్‌ లోని అరారియా జిల్లాలో చోటుచేసుకుంది.

ఈ ఘటన పై పూర్తివివరాలు చూస్తే ..తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో 14 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు విరుచుకుపడి అత్యాచారం చేసాడు. దీనిపై పోలీసులకి ఫిర్యాదుచేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. చిన్నారిపై దాడిచేసిన కామాంధుడిని ఫిరోజ్ అన్సారీగా గుర్తించారు.ఇక బాధితురాలిని మెడికల్ చెకప్ కోసం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. ఇక అక్కడ వైద్యులకు ఈ చిన్నారిని అప్పగించి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఆ చిన్నారికి మెడికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరిగి తన ఇంటికి 40 కిలోమీటర్లు మేరా నడిచి చేరుకుంది. పోలీసులు వెళ్లిపోవడం , లాక్ డౌన్ కావడంతో మరో వాహనం లేక నడిచి ఇంటికి చేరుకుంది.

ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న బీహార్ రాష్ట్ర మానవహక్కుల సంఘం ఛైర్మెన్ దిల్మానీ మిశ్రా... పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచి వివరణ కోరారు. ఆ చిన్నారిని హాస్పిటల్‌లో వదిలేసి ఎందుకు అంత నిర్లక్ష్యం వహించారో చెప్పాలని వెంటనే నివేదిక సమర్పించాలని పోలీస్ శాఖను మానవహక్కుల సంఘం ఆదేశించింది. పోలీసు వాహనంలో తనను తీసుకెళ్లి ఒంటరిగా పోలీసులు వదిలేశారని ఆ చిన్నారి ఆవేదన వ్యక్తం చేసింది. ఇక అత్యాచార ఘటనలో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు, ఈ చిన్నారిని హాస్పిటల్‌కు చేర్చిన పోలీసులు వివరణ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.