Begin typing your search above and press return to search.

ఆ పబ్ ఆదాయం చూసి పోలీసులు షాక్..

By:  Tupaki Desk   |   9 April 2022 4:32 AM GMT
ఆ పబ్ ఆదాయం చూసి పోలీసులు షాక్..
X
హైదరాబాద్లో సంచలనం సృష్టించిన పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత శనివారం రాత్రి ఈ పబ్ పై దాడి చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. ఇక్కడ డ్రగ్స్ వినియోగించారన్న అభియోగంతో పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకొని వదిలేశారు. కానీ వారి దగ్గర నుంచి వివరాలు తీసుకొని వదిలేశారు. అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుండడంతో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 20 మంది డ్రగ్స్ వినియోగించారని, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా పబ్ గురించి కొత్త విషయం హల్ చల్ చేస్తోంది. పుడింగ్ అండ్ పింక్ పబ్ కు నెలనెల ఎంత ఆదాయం వస్తుందని ఆరా తీస్తే పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు.

ప్రతీ నెలా ఈ పబ్ కు మూడున్నర కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నట్లు పోలీసులు గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లోనే రూ.10 లక్షల వరకు ఆదాయం రాగా.. వీకెండ్ లో రూ.30 నుంచి రూ.40 లక్షల ఆదాయం వస్తుందని పోలీసులకు సమాచారం అందింది.

అయితే కస్టమర్లను ఆకర్షించేందుకు రకరకాల ప్రయోగాలు చేశారు పబ్ నిర్వాహకులు. ఇందులో భాగంగానే డ్రగ్స్ ను అలవాడు చేశారని పోలీసులు అంటున్నారు. అంతేకాకుండా పబ్ కు ఆదాయం పెంచుకునేందుకు రకరకాల వక్రమార్గాలు తొక్కారని అంటున్నారు. ఇక వీకెండ్ లో పబ్ లో ఎలాంటి డిస్ట్రబ్ కాకుండా ముందే అన్నీ సెట్ చేసుకుంటారని సమాచారం.

తమ పబ్ పై దాడి చేయకుండా కొందరికి లంచాలు కూడా ఇచ్చారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.పబ్ కు వచ్చిన ఆదాయంలో వాటా రూపంలో వారికి చెల్లించి అక్రమంగా పబ్ నిర్వహించారని తెలుస్తోంది. ఇక పబ్ నిర్వాహకుల్లో ఒకరైన అభిషేక్ కు గోవాతో సంబంధాలున్నాయని పోలీసులు అంటున్నారు. ఆయనకు ముంబై వ్యక్తులతో సంబంధాలున్నాయని, వారి ద్వారానే ఈ పబ్ కు డ్రగ్స్ తీసుకొచ్చారని అంటున్నారు. ఇందులో భాగంగా ఈ పబ్ కు వచ్చిన 20 మంది డ్రగ్స్ తీసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారికి పరీక్షలు చేసిన తరువాత అసలు విషయం చెబుతామని అంటున్నారు.

పబ్ పై దాడి చేసిన సమయంలో 150 మందిని అదుపులోకి తీసుకొని వదిలేశారు. అయితే వారి దగ్గర నుంచి వివరాలు సేకరించిన పోలీసులు వారిపై నిఘా పెట్టారు. ఈ పబ్ లోకి వచ్చిన వాళ్లు ఎప్పటి నుంచి పబ్ కు వస్తున్నారు..? డ్రగ్స్ తో సంబంధాలున్నాయా..? ఎప్పటి నుంచి ఉన్నాయి..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

అయితే కొందరు సరదాగా వెళ్లినా తమపై పోలీసులు అనవసరంగా దాడి చేశారని, తమ వివరాలు బహిర్గతం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం డ్రగ్స్ తీసుకున్న వారిపై మాత్రమే విచాణ చేస్తామని అంటున్నారు. ఏదీ ఏమైనా ఈ కేసు విషయంలో పోలీసులు చాలా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది.