Begin typing your search above and press return to search.

తబ్లిగీ జమాతే చీఫ్‌ పై హత్య కేసు నమోదు..కారణం ఏంటంటే!

By:  Tupaki Desk   |   15 April 2020 4:00 PM GMT
తబ్లిగీ జమాతే చీఫ్‌ పై హత్య కేసు నమోదు..కారణం ఏంటంటే!
X
దేశంలో కరోనా మహమ్మారి పెద్దగా లేదు అని సంబర పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ నిజాముద్దీన్ ఘటన బయటపడటంతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దేశంలో మొదటగా చిన్నగా మొదలైన ఈ కరోనా వ్యాప్తి .. ఢిల్లీ ఘటన తరువాత ఒక్కసారిగా విజృంభించింది. మర్కజ్ సదస్సుకు దేశ విదేశాల నుంచి వేలాది మంది హాజరయ్యారు. విదేశాల నుంచి వచ్చినవారి నుంచి సదస్సులో పాల్గొన్న మిగతా వారికి కరోనా సోకినట్లుగా అధికారులు నిర్దారించారు.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో ఎక్కువ భాగంగా జమాతే సభ్యుల ద్వారా కరోనా వ్యాపించినట్లు గుర్తించారు. కరోనా నేపథ్యంలో నిషేధాజ్ఞలు, లాక్‌ డౌన్‌ ఉన్నా.. ఎలాంటి భద్రత చర్యలు తీసుకోకుండా 1,300 మందితో సమావేశం నిర్వహించినందుకు తబ్లీగీ జమాతే చీఫ్ మౌలానా సాద్‌ పై ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తికి కారకులయ్యారంటూ జమాతేపై కూడా ఐపీసీ 304 ప్రకారం హత్య కేసు నమోదు చేశారు.

ఇప్పటికే మౌలానా సాద్ సెల్ఫ్ క్వారంటైన్ సమయం పూర్తైంది. దీంతో ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే విచారణకు హాజరుకావాలంటూ సాద్‌కు పోలీసులు రెండు నోటీసులు పంపారు. తబ్లీగీ జమాతే కార్యాలయంలో తనిఖీలు చేసిన ఢిల్లీ పోలీసులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.