Begin typing your search above and press return to search.

పోలవరం ప్రాజెక్ట్: నేడే భూమి పూజ .. రేపటి నుండి రంగంలోకి మేఘా

By:  Tupaki Desk   |   1 Nov 2019 5:34 AM GMT
పోలవరం ప్రాజెక్ట్: నేడే భూమి పూజ .. రేపటి నుండి రంగంలోకి మేఘా
X
పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్‌ లో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ తిరిగి పనులను దక్కించుకున్న విషయం తెలిసిందే. మేఘా సంస్థ గత ధర కంటే 12.6 శాతం తక్కువగా కోట్‌ చేసి ఈ ప్రాజెక్ట్ ని దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 4987 కోట్ల రూపాయిలకు టెండర్‌ ను పిలిచింది. మేఘా సంస్థ 4358 కోట్ల రూపాయిలతో టెండర్‌ వేసింది. పోలవరం ప్రాజెక్ట్ లో హెడ్‌ వర్క్స్‌, జల విద్యుత్‌ కేంద్రాల నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ చేపట్టనున్నది. పోలవరం ప్రధాన ప్రాజెక్టు రీటెండర్‌ తో ప్రభుత్వానికి సుమారుగా 628 కోట్ల రూపాయిలు ఆదా అయింది. ప్రభుత్వం రీటెండర్‌ అమలు చేయడం తో నవయుగ సంస్థ హైకోర్టు ను ఆశ్రయించింది. దీనితో దీనిపై సమగ్ర విచారణ జరిపే వరకు మేఘా సంస్థ పనులని స్టార్ట్ చేయకూడదు అంటూ కోర్ట్ స్టే ఇచ్చింది. తాజాగా హైకోర్టు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పై ఇచ్చిన స్టేను ఎత్తేసింది. ఆర్బిట్రేషన్‌ ప్రక్రియ మొదలైన తర్వాత రిట్‌పిటిషన్‌కు విలువ ఉండదన్న ఏజీ వాదనతో ఏకీ భవించిన హైకోర్టు స్తే ఎత్తేసింది.

ఇక హై కోర్ట్ స్టే ఎత్తివేయడంతో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ పనులని ప్రారంభించనుంది. ఈ రోజు భూమి పూజ చేసి నవంబర్2 ,శనివారం నుండి పనులను ప్రారంభించనున్నది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. ఈ పోలవరం ప్రాజెక్టు ను రెండేళ్లలో పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో పనులని వెంటనే ప్రారంభించాలని రేపటినుండే పనులని ప్రారంభించబోతున్నారు. ఒకేసారి రిజర్వాయర్ పనులు, జల విద్యుత్ కేంద్రం పనులని పూర్తి చేయబోతుంది.

ఇక పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే .. మొత్తంగా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతుంది. అలాగే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ని చేయబోతున్నారు. అలాగే 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణా నదికి తరలించనున్నారు. వీటితో పాటుగా 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్నం నగర తాగునీటి అవసరాల నిమిత్తం తరలించనున్నారు. ఇక పోలవరం కాలువకు అనుకుని ఉన్న 540 గ్రామాల్లోని 28.5 లక్షల మంది ప్రజలకు త్రాగునీరుని అందించబోతున్నారు.