Begin typing your search above and press return to search.

జెండా టాస్కు పూర్తైన వేళ.. దేశ ప్రజలకు మోడీ మాష్టారి తాజా టాస్కు ఇదే

By:  Tupaki Desk   |   28 Aug 2022 8:30 AM GMT
జెండా టాస్కు పూర్తైన వేళ.. దేశ ప్రజలకు మోడీ మాష్టారి తాజా టాస్కు ఇదే
X
దేశ ప్రజల్ని ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశంపై ఒక తాటి మీదకు తీసుకొచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అనుసరించే విధానాలు చాలా సిత్రంగా ఉంటాయి. ఆ మాటకు వస్తే.. ఇప్పటివరకు మరే దేశ ప్రధాని కూడా ఈ తరహాలో వ్యవహరించలేదనే చెప్పాలి. ఎప్పటికప్పుడు ఏదో ఒక టాస్కు ఇవ్వటం.. దాని గురించి యావత్ దేశం మాట్లాడుకునేలా చేయటం.. తన ఇమేజ్ ను అంతకంతకూ పెంచుకోవటం లాంటి వాటిల్లో ఆయన తర్వాతే ఎవరైనా.

మొన్నటికి మొన్న ఆగస్టు నెల ఆరంభంలో మన్ కీ బాత్ లో మాట్లాడిన మోడీ మాష్టారు.. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు జెండా పండుగ చేసుకోవాలని.. పంద్రాగస్టుకు కాస్త ముందుగా (ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు) ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేయాలన్న పిలుపును ఇవ్వటం.. అదెంత సూపర్ హిట్ అయ్యిందన్న సంగతి తెలిసిందే. వజ్రోత్సవాల సందర్భంగా ఇంటింటా తిరంగా అన్న మోడీ పిలుపునకు పాజిటివ్ రెస్పాన్స్ రావటమే కాదు.. ఈ ప్రోగ్రాం సూపర్ హిట్ అయ్యింది.

తాను ఇచ్చిన టాస్కును వాళ్లు.. వీళ్లు అన్నతేడా లేకుండా అందరూ సూపర్ సక్సెస్ చేసిన నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పిన ఆయన.. పంద్రాగస్టు వేడుకల్ని విదేశాల్లోనూ నిర్వహించారన్నారు. ఇక.. సెప్టెంబరు నెల టాస్కుగా దేశ ప్రజలకు ఇప్పటివరకు ఎప్పుడూ చెప్పని సరికొత్త పాయింట్ చెప్పుకొచ్చారు. అదేమంటే.. సెప్టెంబరు మాసంలో డీడీలో టెలికాస్ట్ అయ్యే స్వరాజ్ సీరియల్ ను చూడాలని ప్రజల్ని కోరారు.

స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలు.. వారు చేసిన త్యాగాల్ని ఈ సీరియల్స్ లో చూస్తామన్న ఆయన.. అమృత మహోత్సవాల అమృత ధార దేశం నలుమూలలా ప్రవహిస్తోందన్నారు. ఏ నెలకు ఆ నెల ఏదో ఒక రూపంలో దేశ ప్రజలందరికి టాస్కులు ఇస్తున్న వైనం చూస్తే.. మోడీనా మజాకానా? అనుకోకుండా ఉండలేం.