Begin typing your search above and press return to search.

ఎప్పుడూ జరగనిది తాజా కేంద్ర కేబినెట్లో జరిగిందా?

By:  Tupaki Desk   |   25 Nov 2016 5:35 AM GMT
ఎప్పుడూ జరగనిది తాజా కేంద్ర కేబినెట్లో జరిగిందా?
X
అవుననే చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. దీనికి సముచిత కారణం లేకపోలేదు. ఓపక్క పెద్దనోట్ల రద్దు వ్యవహారం దేశ వ్యాప్తంగా సెగలు.. పొగలు పుట్టిస్తున్న పరిస్థితి. యావత్ దేశం గతంలో మరే అంశానికి లేని విధంగా నోట్ల రద్దుపై వ్యతిరేకం.. అనుకూలమనేలా చీలిపోయాయి. అయితే.. మెజార్టీ ప్రజలు తమ వైపే ఉన్నట్లుగా మోడీ సర్కారు చెబుతోంది. దీన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇలా రద్దుపై హాట్ హాట్ గా చర్చ నడుస్తున్న వేళ.. గురువారం రాత్రి కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది.

ప్రతివారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశాలకు.. తాజాగా జరిగిన సమావేశానికి వ్యత్యాసం ఉందని చెప్పాలి. సాధారణంగా కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత.. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాల్ని అధికారికంగా వెల్లడిస్తారు. అయితే.. తాజా మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని వెల్లడించకపోవటం గమనార్హం. అంతేకాదు.. గురువారం రాత్రి 8 గంటల సమయంలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుందన్న సమాచారం మీడియాకు అందింది. అయితే.. ప్రధాని మోడీ ఈ సమావేశానికి 15 నిమిషాలు ఆలస్యంగా రావటం విశేషం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. దేశ వ్యాప్తంగా నోట్ల రద్దుపై చర్చలు జోరుగా సాగుతున్న వేళ.. బ్యాంకుల్లో నగదు మార్పిడికి గురువారమే చివరి రోజు అయిన వేళ.. సమావేశమైన కేబినెట్ మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడతాయని అందరూ ఆశించారు. కానీ.. సమావేశం ప్రారంభమైన ఐదు నిమిషాల తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం నుంచి బయటకు వచ్చేయటంపై చర్చ సాగుతోంది.

కీలకమైన వేళ.. ఆర్థికమంత్రి సమావేశంలో లేకుండా ఉండటం ఏమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మోడీ నిర్ణయాల్ని జైట్లీ వ్యతిరేకించారా? సమావేశంలో ఏమైనా భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయా? అసలు ఆర్థికమంత్రి కేబినెట్ సమావేశం నుంచి ఎందుకు బయటకు వచ్చేశారు? సమావేశం ముగిసిన తర్వాత తీసుకున్ననిర్ణయాల వివరాలు ఎందుకు వెల్లడించలేదన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎప్పుడూ జరగనివి తాజా కేబినెట్ సమావేశంలో జరిగాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/