Begin typing your search above and press return to search.

పాక్ నుండి ఇలా కూడా హాని ఉందా ?

By:  Tupaki Desk   |   22 May 2020 6:00 AM GMT
పాక్ నుండి ఇలా కూడా హాని ఉందా ?
X
పాకిస్తాన్ నుండి భారత్ సరిహద్దు ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి మిడతల దండు రాకుండా అడ్డుకునేందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ మిడతల నివారణ చర్యలలో భాగంగా యూకే నుంచి ప్రత్యేక డ్రోన్లు, ఉపగ్రహ ఉత్పన్న సాధనాలు, ప్రత్యేక ఫైర్ టెండర్లు, స్ప్రేయర్లను దిగుమతి చేసుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. పాక్ నుంచి వచ్చే మిడతల వాళ్లకు రాజస్థాన్ గుజరాత్ లో మూడు లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లిందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది.

ఐక్యరాజ్య సమితి హెచ్చరికలతో తక్షణమే స్పందించిన కేంద్రం మిడతల నివారణకు కేంద్రం చర్యలు చేపట్టింది. పాక్ నుంచి వచ్చే మిడతలు రోజుకు 150 కిలోమీటర్ల వరకు ఎగురుతాయని, అవి ఒక చదరపు కిలోమీటరు సమూహం ఒకే రోజులో 35వేలమంది ఆహారాన్ని తినగలవని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. తూర్పు ఆఫ్రికాలో తుపాన్ల వల్ల మిడతల సంతానోత్పత్తి పెరిగిందని, దీనితో భారతదేశం, చైనా, పాకిస్థాన్ దేశాల్లో పంటలకు ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు జారీచేసింది.

దీంతో పాకిస్థాన్ తమ దేశంలో ఇప్పటికే వ్యవసాయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మిడతల దాడుల వల్ల రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో 3 లక్షల హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లనుంది. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్, జైసల్మేర్ జిల్లాల్లో కీటకాల ఉద్ధృతిని వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారులు గుర్తించారు. మిడతల నివారణపై దృష్టి సారించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పురుగుమందుల కంపెనీల ప్రతినిధులతోనూ సంప్రదింపులు జరిపారు. లాక్ డౌన్ అమలు అవుతున్నప్పటికీ మిడతల నియంత్రణ కార్యాలయాలతో కలిసి 50 స్ప్రేయింగ్ పరికరాలు, వాహనాలతో మిడతల నివారణకి చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.