Begin typing your search above and press return to search.

కేంద్ర కేబినెట్ లో గుజరాత్ మోడల్

By:  Tupaki Desk   |   23 Jan 2016 5:17 AM GMT
కేంద్ర కేబినెట్ లో గుజరాత్ మోడల్
X
మోడీ గుజరాత్ మోడల్.... సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎక్కడ విన్నా అదే మాట. దేశమంతా గుజరాత్ మోడల్ అమలు చేసి అభివృద్ది పరుగులు తీయిస్తానని మోడీ చెప్పేవారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని సుస్థిరం చేయడానికి, కేబినెట్ ను బలోపేతం చేయడానికి కూడా మోడీ అదే గుజరాత్ మోడల్ ను నమ్ముకోబోతున్నట్లు తెలుస్తోది. ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నట్లుగా కేంద్ర కేబినెట్ మార్పుల్లో గుజరాత్ మోడల్ కనిపించబోతోందని తెలుస్తోంది. తనకు అత్యంత విశ్వాసపాత్రుడు - గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి తనకు కీలక సలహాదారు అయిన పీయూష్ గోయల్ కు కీలక మంత్రి పదవి ఇచ్చి దేశ ఆర్థికరంగానికి జవసత్వాలు ఇవ్వాలన్నది ప్రధాని మోడీ ఆలోచనగా తెలుస్తోంది. ప్రస్తుతం విద్యుత్ - బొగ్గు శాఖల మంత్రిగా ఉన్న గోయల్ మహా మేధావి. చార్టర్డ్ అకౌంటెన్సీలో ఆల్ ఇండియా లెవల్లో రెండో ర్యాంకు సాధించిన ఘనత ఆయనది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ యూనివర్సిటీలు ఆయనతో లెక్చర్లు ఇప్పిస్తుంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - బ్యాంక్ ఆఫ్ బరోడా వంటివాటి బోర్డుల్లో కూడా ఆయన ఉండేవారు. ఆయన 28 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నికల వ్యవహారాల్లో కంటే ఆర్థిక వ్యవహారాల్లో మేధావి అన్న పేరు తెచ్చుకున్నారు. ప్రధాని రేసులోకి మోడీ రావడం నుంచి ప్రధానిగా గెలవడం వరకు మోడీ సూచించిన ఆర్తిక విధానాలు, ఆలోచనల వెనుక గోయల్ ఉన్నారని చెబుతుంటారు. గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పటి నుంచి మోడీ వెనుక గోయల్ బుర్ర పనిచేస్తుందంటారు. మోడీ ప్రధాని కావడం వెనుక గోయల్ కృషి ఎంతో ఉందన్నది వారి సన్నిహితుల మాట. అందుకే ఇప్పుడు గోయల్ ను ఆర్థిక మంత్రిని చేసి గుజరాత్ మోడల్ ఇంప్లిమెంటు చేయాలని మోడీ అనుకుంటున్నట్లు సమాచారం.

కేంద్ర కేబినెట్‌లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టనున్నారని అందులో భాగంగా అరుణ్‌ జైట్లీని ఆర్థిక శాఖ నుంచి తప్పించి మోడీ ప్రధాని అయ్యేందుకు సహకరించిన విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కు అప్పగించాలని, సీనియర్‌ నేత జైట్లీకి రక్షణ శాఖ కేటాయించే అవకాశం ఉందని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.

పన్ను విధానంలో భారీ సంస్కరణలను ప్రవేశ పెట్టడంలో జైట్లీ విఫలమయ్యారనే విమర్శలున్నాయి. అరుణ్‌ జైట్లీ శాఖ మార్పిడికి ప్రధాన కారణం పన్ను విధానంలో భారీ సంస్కరణలను ప్రవేశ పెట్టడంలో విఫలమవడం, అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోడీ తరపున ధాటిగా విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేక పోవడంతో పాటు 2 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు నాయకత్వం వహించడంలో విఫలం చెందారనే ఆరోపణలు. ఆయన హయాంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటున్నా, ఉద్యోగాల కల్పనలోనూ, ఉద్యోగాలను విస్తరింప చేయడంలోనూ చేతులెత్తేయడంతో యువత అసహనంగా ఉందని ప్రధాని భావిస్తున్నారని సమాచారం.

ఫిబ్రవరిలో జరగనున్న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల అనంతరం కేబినెట్‌లో మార్పులు చేర్పులకు అవకాశముంది. ఈ శీతాకాలం బీజేపీకి జవసత్వాలు తీసుకురాగల నేతలను, ఆర్థిక వ్యవస్థలో నూతన సంస్కరణలు చేపట్టగల సమర్థులను మోడీ ఎంచుకోనున్నారు.

ఆర్థికాభివృద్ధిని సాధించడంలో మోడీ ప్రభుత్వం ప్రగతి బాగానే ఉంది. అయితే అత్యంత కీలక మైన పన్ను విధానంలో భారీ సంస్కరణలు చేపట్టడంలోనూ, భూసంస్కరణల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. భారతదేశంలో పెట్టుబడులు పెడుతున్న దేశ విదేశాల్లోని భారీ పారిశ్రామిక వేత్తలు 2014 ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో బీజేపీ సాధించిన ఘన విజయాన్ని చూసి ఆర్థిక రంగంలో అద్భుతాలు జరుగుతాయని ఆశించారు. ఆ దిశగా పెట్టుబడులకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా దేశ ఆర్థిక విధానంలో భారీ సంస్కరణలను ప్రవేశ పెట్టలేకపోయిందని వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రధానిగా నరేంద్రమోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన గుజరాత్‌ సీఎంగా సాధించిన ఘన విజయాలు కూడా తుడిచి పెట్టుకుపోయాయి. దీంతో ఆర్థిక మంత్రిగా విఫలమైన అరుణ్‌ జైట్లీని ఆ శాఖ నుంచి తప్పించాలని భావిస్తున్న ప్రధాని మోడీ తనకు విశ్వాస పాత్రుడు, విద్యుత్‌ సంస్కరణలతో గుజరాత్‌ సీఎం నరేంద్రమోడీని ప్రధాని పీఠం ఎక్కించడంలో కీలక భూమిక పోషించిన కేంద్ర విద్యుత్‌ శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ కు కట్టబెట్టాలని భావిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. .ఇప్పటికే ఆయనకు సమాచారం ఇవ్వడంతో బ్యాంకింగ్‌కు సంబంధించిన లావాదేవీలపై అధ్యయనం చేస్తున్నారని సమాచారం. మరోవైపు గోయల్‌ మంచి సంబంధాలను నెరపడంలో దిట్ట. తరుచుగా ప్రధాని మోడీతో కలిసి విదేశాల్లో పర్యటించడంతో వారిద్దిరికీ మంచి సాన్నిహిత్యం ఉంది.