Begin typing your search above and press return to search.

ప్యాకేజీనే ముద్దు.. బాబు లేఖ కలకలం

By:  Tupaki Desk   |   27 March 2019 6:38 AM GMT
ప్యాకేజీనే ముద్దు.. బాబు లేఖ కలకలం
X
అవసరార్థం వాడుకొని వదిలేయడంలో చంద్రబాబును మించిన రాజకీయ చాణక్యుడు లేడని ఆయన ప్రత్యర్థులు ఆడిపోసుకుంటారు.. మొన్నటి ఎన్నికల సీట్ల కేటాయింపులో ఇది స్పష్టమైంది కూడా.. వైసీపీ నుంచి టీడీపీలో చేర్చుకున్న కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిలకు చివర్లో చిప్ప చేతుల్లో పెట్టి సీట్లు నిరాకరించిన వైనం విస్తుగొలిపింది. సీట్లు దక్కని వారు బాబు మోసాన్ని తలుచుకొని బోరుమని ఏడ్చేశారు. నిండా మునిగాక మళ్లీ పాత జగన్ వద్దకు వచ్చి చేరారు. ఇలా వాడుకొని వదిలేయడంలో బాబు తర్వాతే ఎవరైనా.. కానీ అది ప్రత్యర్థులు ఫోకస్ చేయకపోవడంతో ప్రతిసారి తప్పించుకుంటున్నారు..

ఇప్పుడూ అదే జరిగింది.. ప్రత్యేక హోదా ఇవ్వక బీజేపీ మోసం చేసిందని మొసలి కన్నీరు కారుస్తున్న బాబు గారి ప్రచారానికి కేంద్రంలోని బీజేపీ చెక్ పెట్టింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. అప్పట్లో హోదా వద్దు.. ప్యాకేజీ ముద్దు అంటూ ఏపీ సీఎం హోదాలో చంద్రబాబు రాసిన లేఖను స్వయంగా బయటపెట్టడం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. హోదాకు బదులుగా ఏటా 3500కోట్ల చొప్పున ఐదేళ్లకు 17500కోట్లు ఇవ్వాలని లేఖలో బాబు ప్రతిపాదన పెట్టడం.. దాన్ని పీయూష్ గోయల్ బయటపెట్టడంతో బాబు నోట్లో పచ్చివెలక్కాయపడ్డట్టు అయ్యింది..

ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వడం లేదని ఏపీ ప్రజల వద్ద అభాసుపాలు చేస్తున్న చంద్రబాబుకు ఇప్పుడు బీజేపీ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. హోదా వద్దు ప్యాకేజీ డబ్బులు కావాలని స్వయంగా బాబు రాసిన లేఖను బయటపెట్టింది. ఆ డబ్బుతో ప్రాజెక్టులు కడుతారో.. స్వాహా చేస్తారో తెలియదు కానీ కేంద్రం మాత్రం బాబు గారు కేంద్ర నిధులను సొంతానికి వాడేస్తున్నారన్న విమర్శలు చేస్తున్నారు. ఆ కోవలోనే బాబు డబ్బులు అడగడం.. బీజేపీకి డౌట్ వచ్చి ప్యాకేజీ డబ్బులు ఇవ్వకపోవడం జరిగిపోయింది.

ఎన్నికల వేళ హోదా ఇవ్వడం లేదని బీజేపీని విలన్ ను చేసి.. జగన్ ను దోషిని చేసి గట్టెక్కుదామని ప్రయత్నించిన బాబు అండ్ అనుకూల మీడియాకు ఇప్పుడు బీజేపీ ఒక్క లేఖతో షాక్ ఇచ్చింది. పీయూష్ విడుదల చేసిన లేఖపై యూటర్న్ తీసుకున్న బాబు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారనే ఆసక్తి ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.