Begin typing your search above and press return to search.

సంచలనం: గోల్డ్ స్కాం చార్జిషీటులో సీఎం పేరు!

By:  Tupaki Desk   |   8 Oct 2020 3:00 PM GMT
సంచలనం: గోల్డ్ స్కాం చార్జిషీటులో సీఎం పేరు!
X
కేరళలో బయటపడ్డ దుబాయ్ గోల్డ్ స్కాం వ్యవహారంలో సీఎం కార్యాలయం అధికారుల పాత్ర కూడా బయటపడి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ అతిపెద్ద స్కాం ఇప్పటికే కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. తాజాగా ఈ కేసు మలుపు తిరిగింది. గోల్డ్ స్కాం నిందితుల విషయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసి చార్జిషీటులో కేరళ సీఎం పినరయి విజయన్ పేరు ఉండడం సంచలనంగా మారింది.

ఈ స్కాంలో ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ కు సీఎంతో సన్నిహిత సంబంధాలుండడంతో సీఎం పాత్రతో పాటు సీఎం కార్యాలయంలోని ఉన్నతాధికారుల పాత్రపై మరింత లోతుగా విచారణ జరపాలని ఈడీ తన చార్జిషిటులో పేర్కొనడం గమనార్హం.

కేరళ సీఎం పినరయి విజయన్ సీఎంవో కార్యాలయంలో ‘గోల్డ్ స్కాం’ గత నెల కిందట కలకలం రేపింది. సీఎంవోలో పనిచేస్తున్న ఐఏఎస్ కు దుబాయ్ నుంచి గోల్డ్ దిగుమతి స్కాంలో పాత్రధారి కావడం కేరళ సీఎంను ఇరుకునపెట్టింది. ఈ బంగారం స్కాంలో ప్రధాన సూత్రధారిగా స్వప్న సురేష్ కథ ఏకంగా కేంద్రం రంగంలోకి దిగేదాకా సాగింది.

ఈ వ్యవహారంలో సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణలతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, ఐటీ సెక్రెటరీ ఎం. శివశంకర్ ను తొలగించడం రాజకీయ దుమారాన్ని రేపింది. దుబాయ్ నుంచి వచ్చిన చార్టర్డ్ విమానంలో వచ్చిన యూఏఈ దేశ కాన్సులేట్ కార్యాలయానికి సంబంధించిన పార్సిల్స్ లో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఈ దందా వెలుగుచూసింది. యూఏఈ దేశ కాన్సులేట్ నకిలీ పత్రాలు ఉపయోగించి దౌత్యమార్గాల ద్వారా ఈ బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని తేలింది.

ఈ మొత్తం బంగారం అక్రమ రవాణాలో కీలక నిందితురాలుగా స్వప్నా సురేష్ మీద ఆరోపణలు వచ్చాయి. భారీ ఎత్తున బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన ఈ కేసులో సరిత్, స్వప్నా సురేష్, ఫాజిల్ ఫరీద్, సందీప్ నాయర్ లను ‘ఎన్ఐఏ’ నిందితులుగా గుర్తించింది. స్వప్న సురేష్, సందీప్ నాయర్ లను కస్టడీలోకి జాతీయ దర్యాప్తు సంస్థ తీసుకుంది. తాజాగా ఈ కేసులో ఈడీ చార్జిషీటు దాఖలు చేయడం.. అందులో కేరళ సీఎం పేరు ఉండడం సంచలనంగా మారింది.