Begin typing your search above and press return to search.

ఓ ఫొటో చుట్టూ ఇన్ని వివాదాలా ? తల పట్టుకున్న మోడి సర్కార్

By:  Tupaki Desk   |   2 Dec 2020 3:30 PM GMT
ఓ ఫొటో చుట్టూ ఇన్ని వివాదాలా ? తల పట్టుకున్న మోడి సర్కార్
X
నరేంద్రమోడి సర్కార్ అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ సంస్కరణల చట్టం చాలా వివాదాలనే సృష్టిస్తోంది. చట్టాన్ని వ్యతిరేకిస్తు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ శివార్లలో ఆందోళనలు చేయటం ఒక ఎత్తు. ఇదే సమయంలో రైతులపై పోలీసులు లాఠీ చార్జి చేయటం మరో ఎత్తుగా నిలిచింది. ఈ ఆందోళనల్లో కూడా ఓ వృద్ధ రైతును పోలీసులు లాఠీతో కొడుతున్నట్లున్న ఫొటో చుట్టు చాలా వివాదాలే రేగుతున్నాయి.

వృద్ధులని కూడా చూడకుండా రైతులను పోలీసులు ఎలా కొడతారంటూ ప్రతిపక్షాలు మోడి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రదానంగా కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధి ఈ ఫొటోను టన ట్విట్టర్లో పోస్టు చేయటమే కాకుండా మోడి ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దాంతో ఇతర ప్రతిపక్షాలతో పాటు దేశంలోని మానవహక్కుల సంఘాలన్నీ రంగంలోకి దూకేశాయి. ఒకదాని తర్వాత మరో పార్టీ మోడి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని మరీ రెచ్చిపోతున్నాయి.

అయితే కేంద్రప్రభుత్వం, బీజేపీ నేతలు మాత్రం పోలీసులెవరు ఫొటోలో కనిపిస్తున్న రైతును కొట్టలేదని కేవలం భయపెట్టారని మొత్తుకుంటోంది. అయినా ఎవరు వినిపించుకోవటం లేదు. చేసిందంతా చేసి ఇపుడు పోలీసులను మోడి ప్రభుత్వం వెనకేసుకొస్తోందంటూ ప్రతిపక్షాలు మరింతగా రెచ్చిపోతున్నాయి. ఇదే సమయంలో పొటో తీసిన ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఫోటో జర్నలిస్టు రవి చౌదరి మాత్రం సదరు పోలీసు రైతును కొట్టడం తాను చూశానంటూ తాజాగా బూమ్ లైవ్. కామ్ కు చెప్పటంతో మళ్ళీ వివాదం రాజుకుంది. అసలు కొన్నా కొసరే ఎక్కువనే సామెతలో లాగ తయారైంది మోడి సర్కార్ వ్యవహారం.

ఫొటోలో కనిపిస్తున్న రైతు సుఖ్ దేవ్ సింగ్ బూమ్ లైవ్. కామ్ తో మాట్లాడుతూ సదరు పోలీసు తనను లాఠీతో కొట్టినట్లు చెప్పారు. ఒకరు కాదని ఇద్దరు పోలీసులు తనను లాఠీతో కొట్టినపుడు తన కాళ్ళకు, చేతులకు బాగా దెబ్బలు తగినట్లు సింగ్ చెప్పటంతో వివాదం తారాస్ధాయికి చేరుకుంది. దెబ్బలు తగిలినా సరే సుఖ్ దేవ్ సింగ్ మాత్రం హర్యానా-ఢిల్లీ సరిహద్దులోని ఇతర రైతులతోనే ఆందోళనల్లో పాల్గొంటున్నారు.