Begin typing your search above and press return to search.

పెట్రో బాదుడు శాశ్వితం బాస్.. తేల్చేసిన సీనియర్ నేత

By:  Tupaki Desk   |   25 March 2021 5:11 AM GMT
పెట్రో బాదుడు శాశ్వితం బాస్.. తేల్చేసిన సీనియర్ నేత
X
సంక్షేమ ప్రభుత్వమని ఢంకా బజాయించి చెప్పే పార్టీలకు కొదవలేదు. అధికారం చేతికి వచ్చినంతనే ఏదో ఒక సంక్షేమ పథకాన్ని తీసుకురావటం ద్వారా ప్రజల మనసుల్ని దోచేయాలనే పార్టీలకు.. విపక్షంలో ఉంటూ.. తమకు అధికారం వస్తే.. ఆల్ ఫ్రీ అనే పార్టీలతో సహా.. ఎవరు కూడా సగటుజీవి మీద భారం పడకుండా.. వాడి బతుకు బండి సాఫీగా సాగేందుకు మాత్రం ప్రయత్నాలు చేయకపోవటం గమనార్హం. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు పెట్రో బాదుడు కారణంగా ప్రతి ఒక్కరి మీద భారం పడుతూనే ఉంటుంది.

మరి.. దీని నుంచి తప్పించుకోవటానికి మార్గం లేదా? అంటే.. పెట్రోల్.. డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. పన్ను భారం సగానికి సగం తగ్గిపోయే వీలుంది. అయితే.. దీని వల్ల కేంద్రంతో సహా రాష్ట్రాలకు భారీ ఎత్తున ఆదాయం తగ్గిపోతుంది. ఇవాల్టి రోజున రాష్ట్రాలకు వచ్చే ఆదాయాల్లో కీలకం పెట్రోల్.. డీజిల్ మీద వచ్చే పన్ను ఆదాయమే. దీంతో పాటు.. ఎక్సైజ్ ఆదాయం కూడా దండిగా వస్తోంది. ఈ రెండింటిని వదులుకోవటానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు.

ఇదే విషయాన్ని తాజాగా బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ స్పష్టం చేస్తున్నారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్.. డీజిల్ ఉత్పత్త్తులను తీసుకురావటం సాధ్యం కాదన్నారు. జీఎస్టీ కిందకు వస్తే వార్షికంగా రూ.2లక్షల కోట్ల మేర నష్టాన్ని రాష్ట్రాలు చూడాల్సి వస్తుందని.. అంత మొత్తాన్ని ఎవరు భర్తీ చేయగలరని ప్రశ్నించారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకు వచ్చేందుకు మరో 8-10 ఏళ్లు వెయిట్ చేయాల్సి వస్తుందన్న మాట ఆయన నోట వింటే.. పెట్రో బాదుడు శాశ్వితమన్న అభిప్రాయం కలుగక మానదు.

పెట్రోలియం ఉత్పత్తుల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే 28 శాతమే పన్ను అవుతుంది. ఇవాల్టి రోజున 60 శాతం వరకు పెట్రో ఉత్పత్తుల మీద పన్నులు విధిస్తున్నారు. పెట్రోల్.. డీజిల్ ధరలు చారిత్రక గరిష్టాలకు చేరుకున్న వేళ.. జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఇలాంటివేళ బీజేపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.