Begin typing your search above and press return to search.

ఎన్నిక పూర్తయింది..వడ్డింపు షురూ అయ్యిందే

By:  Tupaki Desk   |   16 Nov 2015 9:35 AM IST
ఎన్నిక పూర్తయింది..వడ్డింపు షురూ అయ్యిందే
X
ఎన్నికలు ముగిసిన వేళ.. వడ్డింపులు షురూ అయ్యాయి. గత కొద్ది నెలలుగా ఎలాంటి వడ్డింపుల్లేని పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై కేంద్రం అదనపు భారం వేసింది. ప్రతి నెలా 15వ తేదీన నెలాఖరు రోజున పెట్రోల్.. డీజిల్ ఛార్జీల విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటం తెలిసిందే. తాజాగా.. పెట్రోల్.. డీజిల్ పై ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి.

అయితే.. బీహార్ ఎన్నికల నేపథ్యంలో అంతర్జాతీయ పరిస్థితుల్ని పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా ధరల్ని మార్చలేదు. ఇటీవల బీహార్ ఎన్నికలు పూర్తి కావటం.. ఫలితాలు వచ్చేసిన నేపథ్యంలో.. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా క్రూడ్ ఆయిల్ ధరల్ని పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. పెట్రోలియం సంస్థలు తీసుకున్న నిర్ణయానికి కేంద్రం పచ్చ జెండా ఊపేసింది.

తాజాగా పెంచిన పెంపు కారణంగా.. పెట్రోల్ మీద లీటరుకు 36 పైసలు.. డీజిల్ లీటరు ఒక్కింటికి 87 పైసలు చొప్పున పెరిగింది. గడిచిన ఐదు నెలల్లో పెట్రోల్ ధర పెరగటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఇక.. డీజిల్ విషయంలో మాత్రం అక్టోబర్ నుంచి ఇది మూడో పెంపుగా చెప్పొచ్చు. పెరిగిన పెట్రోల్ ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.