Begin typing your search above and press return to search.

జీఎస్టీలోకి పెట్రోల్, డీజల్ - వాయిదాకు అసలు కారణమిదే?

By:  Tupaki Desk   |   18 Sep 2021 8:31 AM GMT
జీఎస్టీలోకి పెట్రోల్, డీజల్ - వాయిదాకు అసలు కారణమిదే?
X
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పెట్రోల్, డీజల్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఇప్పట్లో పెట్రోల్, డీజల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం లేదని తేలిపోయింది. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజల్ ను తీసుకొచ్చే విషయమై కౌన్సిల్ సమావేశంలో చర్చ జరుగుతుందని ప్రచారం జరిగింది. ప్రచారం జరిగినట్లే చర్చ అయితే జరిగింది కానీ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టపడలేదని తేలిపోయింది.

దేశవ్యాప్తంగా ఇపుడు పెట్రోల్ ధర సగటున 101 రూపాయలుంది. అలాగే డీజల్ ధర కూడా లీటర్ కు 100 రూపాయలుంది. పెట్రోల్ డీజల్ బేస్ ధరకు సెంట్రల్ ఎక్సైజ్, స్టేట్ ట్యాక్సు, ఇతర పన్నులు, వ్యాట్, డీలర్ కమీషన్ అన్నీ కలిపి లీటర్ ధర 100 రూపాయలు దాటేసింది. అదే ఈ రెండింటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే చాలా పన్నులు మాయమైపోతాయి. జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే కేవలం జీఎస్టీ ట్యాక్సు+డీలర్ కమీషన్ మాత్రమే ఉంటుంది.

మ్యాగ్జిమమ్ జీఎస్టీ 28 శాతం వేసుకున్నా, డీలర్ కమీషన్ తో కలిపి పెట్రోల్, డీజల్ ధరలు లీటర్ కు 57 రూపాయలు మాత్రమే ఉంటుంది. అంటే 100 రూపాయల పెట్రోల్, డీజల్ ధరలు ఒక్కసారిగా సగానికి సగం తగ్గిపోతుంది. దీనివల్ల కోట్లాదిమంది జనాలకు ఫుల్లు హ్యాపీ. కానీ ఇదే సమయంలో ప్రభుత్వాలకు మాత్రం ఫుల్లు బ్యాడ్. ఎందుకంటే పెట్రోల్, డీజల్ పై వస్తున్న ఆదాయం వేల కోట్లలో ఉంటుంది.

వేల కోట్లరూపాయల ఆదాయన్ని వదులుకోవటానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఏమాత్రం ఇష్టపడటంలేదు. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజల్ బ్యారెల్ ధరల మీదే మనదేశంలో వాటి ధరలు ఆధారపడుంటాయి. కానీ అంతర్జాతీయంగా బ్యారెల్ ధరలు బాగా పడిపోయినా మనదేశంలో ఆ దామాషా ప్రకారం వాటి ధరలు తగ్గకపోగా రివర్సులో మరింతగా పెరిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే వీటి ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల ఆదాయంపై ప్రభుత్వాలు ఆధారపడటమే.

కరోనా వైరస్ కారణంగా కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతోందని చెబుతున్నారు. కానీ పెట్టిన ఖర్చంతా కేంద్రానికి ఆరుమాసాల్లోనే తిరిగి వచ్చేసిందని నిపుణులు చెబుతున్నారు. అయినా వాటి ధరలు తగ్గించటానికి కేంద్రం ఏమాత్రం ఇష్టపడటంలేదు. కేంద్రం మూడ్ చూసే రాష్ట్రాలు కూడా వెనకాడుతున్నాయి. నిజానికి నరేంద్రమోడి సర్కార్ గనుక పెట్రోల్, డీజల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురవాలని గట్టిగా అనుకుంటే ఏ రాష్ట్రమూ అడ్డుపడే అవకాశం లేదని అందరికీ తెలిసిందే. తన నిర్ణయాన్నే రాష్ట్రాలపైకి నెట్టేసి కేంద్రం పబ్బం గడుపుకుంటోంది.