Begin typing your search above and press return to search.

దేశద్రోహం కేసులో పాక్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష!

By:  Tupaki Desk   |   17 Dec 2019 9:16 AM GMT
దేశద్రోహం కేసులో పాక్ మాజీ అధ్యక్షుడికి మరణశిక్ష!
X
పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ కు భారీ షాక్ తగిలింది. ముషారఫ్‌ ను ఉరి తీయాలంటూ పాకిస్తాన్‌ లోని లాహోర్‌ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారంటూ ఆయన పై గతంలో దేశ ద్రోహం కేసు నమోదైంది.ఈ దేశ ద్రోహం కేసులో స్పెషల్ కోర్టు ఈ మరణశిక్ష విధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులపై విచారణ జరిపిన పెషావర్ కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం దోషిగా తేల్చింది. ధర్మాసనంలో ఇద్దరు న్యాయమూర్తులు ముషారఫ్ మరణ శిక్షను సమర్థించగా.. మరొక న్యాయమూర్తి వ్యతిరేకించారు. మెజార్టీ న్యాయమూర్తుల నిర్ణయంతో మరణ శిక్ష ఖరారైంది.

2007లో రాజ్యాంగానికి వ్యతిరేంగా ఎమర్జెన్సీని విధించారు. అయన ఏకంగా దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై గృహ నిర్బంధం విధించి.. చాలామంది న్యాయమూర్తులను అప్పట్లో విధుల నుంచి తప్పించారు. అలాగే అదే సమయంలో మీడియాపై ఆంక్షలు విధించడంతో దేశవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. తర్వాత 2013లో ముషారఫ్‌ పై దేశ ద్రోహం కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ జరుగుతోంది.2016లో వైద్యం పేరుతో ముషారఫ్ దుబాయ్ వెళ్లిపోయి అక్కడే తలదాచుకుంటున్నాడు. తర్వాత కోర్టు సమన్లు పంపించినా స్పందించలేదు. దీంతో కోర్టు ఆయన్ను అరెస్ట్ చేయాలని ఎఫ్‌ ఐను ఆదేశించింది.

ఈ కేసులో విచారణ చేపట్టిన స్పెషల్ కోర్టు నవంబరు 19న తీర్పును రిజర్వ్‌ లో పెట్టింది. ఇప్పుడు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ముషారఫ్ 1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, అధ్యక్షుడికి ఉరిశిక్షను విధించడం పాకిస్తాన్‌ దేశ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో పాక్‌ ప్రధానిగా - అధ్యక్షుడి గా వ్యవహరించిన జుల్ఫీకర్‌ అలీ బుట్టోను కూడా ఉరి తీసిన విషయం తెలిసిందే.