Begin typing your search above and press return to search.

తెలంగాణ ప్రభుత్వం తొందరపడింది ..ఏపీ మంత్రి

By:  Tupaki Desk   |   26 March 2020 12:25 PM GMT
తెలంగాణ ప్రభుత్వం తొందరపడింది ..ఏపీ మంత్రి
X
హైదరాబాద్ నగరంలోని పలు హాస్టళ్ళను మూసి వేస్తూ ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకోవడంతో వేలాది మంది ఏపీ విద్యార్థులు రోడ్డున పడిన సంగతి తెలిసిందే. వారి విఙ్ఞప్తి మేరకు వారందరికీ ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించి, ఎన్ ఓసీలు ఇచ్చి వారు వారి స్వస్థలాలకు వెళ్ళే ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. అయితే వారందరినీ ఏపీ బోర్డర్ల వద్ద నిలిపి వేయడంతోనే సమస్య మొదలైంది. దీనిపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తొందరపడి..ఎన్ ఓసీ లిచ్చి పంపడం వల్లనే వందలాది మంది ఏపీ విద్యార్థులు సరిహద్దులలో పడిగాపులు గాచే పరిస్థితి వచ్చిందని - దానికి తమ ప్రభుత్వాన్ని నిందించడంలో అర్థం లేదని అయన తెలిపారు.

విజయవాడ - గుంటూరు - ఏలూరు మార్గాలలో తెలంగాణ నుంచి వచ్చిన విద్యార్థులు - ప్రైవేటు ఎంప్లాయిస్ ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని స్పందించారు. ఒక్కసారిగా ఉధృతిగా వచ్చి ప్రభుత్వాన్ని నిందించడం భావ్యమా..?’’ అని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్లే గరికపాడు చెక్ పోస్ట్ సమస్య వచ్చింది.. ఆ కాగితాలను అసరాగా చేసుకుని ఉధృతంగా వచ్చి తమ ప్రభుత్వాన్ని నిందించడం సరి కాదు.. ఎన్ ఓసీ వంటి దుర్మార్గపు కాగితాలు తీసుకున్నప్పుడు కరోనా వచ్చే అవకాశం ఉంది కదా? సమస్య ఉత్పన్నమైన వెంటనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం.. నిన్న ఉధృతిగా వచ్చిన వారిలో ఎవరెవరు విదేశాల నుండి వచ్చిన వాళ్లతో సంబంధాలు ఉన్నాయో..? వారిలో ఎవరికి కరోనా ఉందో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి.. థర్మల్ స్క్రీన్ టెస్ట్ చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించడం సరికాదు.. కరోనా లక్షణాలు ఆ క్షణంలో బయట పడేవి కావు.. కరోనా సోకిన తర్వాత 14రోజుల్లో ఏ క్షణమైనా బయటపడే అవకాశం ఉంది.. అంటూ తెలంగాణ సర్కార్‌ పై కామెంట్ చేశారు పేర్నినాని.