Begin typing your search above and press return to search.

పెగాసస్ స్పైవేర్ : బీజేపీకి ఉచ్చు బిగిస్తోన్న కాంగ్రెస్ .. రాజ్‌భవన్‌ల ముట్టడికి స్కెచ్ !

By:  Tupaki Desk   |   20 July 2021 4:50 AM GMT
పెగాసస్ స్పైవేర్ : బీజేపీకి ఉచ్చు బిగిస్తోన్న కాంగ్రెస్ .. రాజ్‌భవన్‌ల ముట్టడికి స్కెచ్ !
X
దేశంలో రాజకీయంగా ప్రకంపనలను రేపుతోన్న పెగాసస్ స్పైవేర్ ఉదంతం మరింత ముదురుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను వణికిస్తుంది. ఈ స్కాండల్ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించి పక్కా ప్రణాళికలు రచిస్తుంది. దేశవ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది. ఆందోళనలకు పిలపునిచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకున పెట్టడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోనుంది. ఈ విషయంలో కాంగ్రెస్ కమిటీలకు దిశా నిర్దేశాలను జారీ చేసింది. 2019 నాటి సాధారణ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు వినియోగించే ఫోన్లను హ్యాక్ చేయడానికి బీజేపీ పెగాసస్ స్పైవేర్‌ ను ప్రయోగించిందనే ఆరోపణలు దేశంలో కలకలం రేపుతోన్నాయి.

రాహుల్ గాంధీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ.. వంటి కీలక నేతల ఫోన్ నంబర్లు పెగాసస్ స్పైవేర్ ద్వారా హ్యాకింగ్‌కు గురైనట్లు తేలడంతో కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. ఈ విషయాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో దీని పై మాట్లాడాల్సిందే అని పట్టుబట్టారు. పెగాసస్ స్పైవేర్ స్కాండల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. గురువారం దేశంలోని అన్ని రాజ్‌ భవన్‌ లను ముట్టడించనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు దిశా నిర్దేశాలను జారీ చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఏక కాలంలో రాజ్‌ భవన్‌ లను ముట్టడించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చింది పార్టీ అధిష్ఠానం.

దీనితోపాటు పెగాసస్ స్పైవేర్ స్కాండల్‌ పై ప్రతిరోజూ విలేకరుల సమావేశాలను నిర్వహించాలని సూచించింది. ఈ స్కాండల్ వల్ల కలిగిన నష్టాన్ని ప్రజలకు వివరించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. పెగాసస్ స్పైవేర్ స్కాండల్‌పై కొద్దిసేపటి కిందటే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యుడు, తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ అంశంపై లోక్‌ సభలో సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఈ వాయిదా తీర్మానంపై స్పీకర్ చర్చకు అనుమతి ఇవ్వకపోతే, సభను స్తంభింపజేయాలని కాంగ్రెస్, దాని మిత్రపక్ష సభ్యులు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఉభయసభల తొలిరోజే ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా వాగ్యుద్ధం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

2014 సాధారణ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిషోర్ అప్పటి ఎన్డీఏ కూటమికి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన బీజేపీకి దూరం కావడంతో నిఘా పెరిగినట్టు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఎన్నికల మాజీ కమిషనర్ అశోక్ లావా, ఎలక్షన్స్ వాచ్‌ డాగ్ ఏడీఆర్ వ్యవస్థాపకుడి ఫోన్ నంబర్లు హ్యాక్ కావడం, ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని పెగాసస్ స్పైవేర్‌ ను ప్రయోగించినట్లు వెల్లువెత్తుతోన్న విమర్శలు, తలెత్తుతోన్న అనుమానాలకు బలం కలిగించినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

ఇదిలావుంటే, పెగాసస్‌ హ్యాకింగ్‌ వ్యవహారంపై కేంద్రం ఘాటుగా స్పందించింది. హ్యాకింగ్ కథనాలు ఉద్దేశపూర్వకంగా వస్తున్నాయే తప్ప అందులో నిజం లేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం కేంద్రం కుట్రపన్నుతోందని ఆరోపిస్తున్నారు. లోక్‌సభలో ఈ రోజు ఇదే అంశంపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీనిపై మంత్రి సమాధానం ఇస్తూ ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు బయట పెట్టిన ఈ హ్యాకింగ్ అంశంపై ఎలాంటి ఆధారాలు లేవని మంత్రి స్పష్టం చేశారు. అక్రమమైన మార్గంలో ఒకరి వ్యక్తిగత సమాచారంపై నిఘా పెట్టడం భారత్‌లో సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. గత రాత్రి ఓ జాతీయ వెబ్‌సైట్‌లో సంచలన కథనం ప్రచురితమైంది.

తెల్లారగానే ఈ అంశంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. పార్లమెంటు సమావేశాలకు ముందు మాత్రమే ఇలాంటివి రావడమంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉందని మంత్రి అన్నారు. ఆ కథనంలో వచ్చిన రిపోర్ట్స్ అన్నీ నిరాధారమైనవని మంత్రి కొట్టిపారేశారు. గతంలో కూడా వాట్సాప్ హ్యాక్ అయిందంటూ అది కూడా పెగాసస్ వినియోగించే ఇది జరిగిందనే ఆరోపణలు వచ్చినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుర్తు చేశారు. అయితే దీనిపై ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అప్పట్లో అన్ని పార్టీలు దీన్ని ఖండించాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక జూలై 18వ తేదీన వచ్చిన రిపోర్ట్స్‌లో కూడా వాస్తవం లేదని ప్రజాస్వామ్యంను భ్రష్టు పట్టించడంతో పాటు కొన్ని గొప్ప వ్యవస్థలను అవమానించడమే అవుతుందని మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.