Begin typing your search above and press return to search.

ఏపీ పాలిటిక్స్‌ను కుదిపేస్తున్న పెగాస‌స్‌.. ఏం జ‌రిగింది? ఎందుకీ వివాదం!

By:  Tupaki Desk   |   20 March 2022 8:30 AM GMT
ఏపీ పాలిటిక్స్‌ను కుదిపేస్తున్న పెగాస‌స్‌.. ఏం జ‌రిగింది?  ఎందుకీ వివాదం!
X
ఏపీ పాలిటిక్స్‌ను గ‌డిచిన రెండు రోజులుగా కొత్త వివాదం కుదిపేస్తోంది. ముఖ్యంగా అదికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య మాట ల యుద్ధం కొన‌సాగుతోంది. వాస్త‌వానికి ఇప్ప‌టికే అనేక స‌మ‌స్య‌లు ఈ రెండు పార్టీల మ‌ధ్య వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. ఓటీఎస్‌, చెత్త‌ప‌న్ను, మ‌ద్య నిషేధం అంశాల‌కు తోడు.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా జంగారెడ్డి గూడెంలో చోటు చేసుకున్న నాటు సారా మ‌ర‌ణాలు(ప్ర‌తి ప‌క్షం నాటుసారా అని, అధికార ప‌క్షం సాధార‌ణ మ‌ర‌ణాల‌ని) వంటివి ఒక‌వైపు తీవ్ర వివాదంగా మారాయి. ఈలోగా ఉరుములు లేని పిడుగు మాదిరిగా.. `పెగాస‌స్` వ్య‌వ‌హారం.. ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని ఒక్క‌సారిగా కుదిపేసింది.

రెండు రోజుల కింద‌ట‌.. ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.. అక్క‌డి అసెంబ్లీలో పెగాస‌స్ వ్య‌వ‌హారం గురించి ప్ర‌స్తావించారు. పెగాస‌స్ కంపెనీవాళ్లు.. 25 కోట్లు ఇస్తే.. తాము ఈ స్పైవేర్‌ను అందిస్తామ‌ని.. ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టుఆమె చెప్పారు. అయితే.. త‌మ ప్ర‌భుత్వం వ‌ద్దందని మ‌మ‌త చెప్పారు. ఇది ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లిగించ‌డ‌మే కాకుండా.. వారి హ‌క్కుల‌ను కూడా కాల‌రాస్తుంద‌ని.. అందుకే తాము వ‌ద్దన్నామ‌ని తెలిపారు. కానీ, కేంద్రంలోని మోడీ స‌ర్కారు కొనింద‌ని ఆరోపించారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో... ఇక్క‌డ ఆమె ఏపీలో అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దీనిని 25 కోట్ల కు కొనుగోలు చేసిన‌ట్టు చెప్పారు.

అంతే! ఒక్క‌సారిగా ఏపీలో అధికార ప‌క్షం స‌భ్యులు టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక్క‌సారిగా రాజ‌కీయ వాతావ‌ర‌ణం మారిపోయింది. అప్ప‌ట్లో త‌మ ఫోన్లపై నిఘా పెట్టార‌ని.. పెగాస‌స్ కొనుగోలు చేసి ఉంటార‌న‌డంలో సందేహం లేద‌ని.. వైసీపీ నాయ‌కులు.. అంబ‌టి రాంబాబు త‌దిత‌రులు పెద్ద ఎత్తున ఆరోపించారు. మా ఫోన్లు ట్యాప్ చేసి రహస్య సమాచారం తీసుకున్నారని వైసీపీ నేత‌లు అంటే.. మాకేం ప‌ని అదే నిజ‌మైతే.. `బాబాయి` వివేకా హ‌త్య ఎలా జ‌రుగుతుంద‌ని.. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఎదురు దాడి చేశారు.

ఏమిటీ పెగాస‌స్‌

పెగాసస్ స్పైవేర్ ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ పరికరాల ఉత్పత్తిదారు ఎన్ఎస్‌వో కంపెనీకి చెందింది. ఈ స్పైవేర్ ఫోన్ లో ఇన్‌స్టాల్‌ అయిన తర్వాత పెగాసిస్‌ కంట్రోల్‌లోకి ఫోన్‌ వెళుతోంది. ఫోనులో ఉన్న ప్రతి అంశాన్ని గమనిస్తుంది. డేటా విశ్లేషణ చేసి కావాల్సిన సమాచారం తీసుకుంటుంది. మాములు పోన్లే కాదు…యాపిల్‌ ఫోన్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదు. వాయిస్‌ కాల్స్‌, వాట్సప్‌, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్‌, కాల్‌ లిస్ట్‌, కాంటాక్ట్‌ అన్ని ట్రాన్స్‌ఫర్‌ అవుతాయి. పెగాసస్ స్పై వేర్ తో ప్రత్యర్థులు, వీవీఐపీల ఫోన్లు హ్యాక్ చేసి వివరాలు తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులు, ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసి తదనుగుణంగా వ్యూహ రచన చేస్తున్నారనే వాదన లేకపోలేదు. 2016లో తొలిసారిగా పెగాసస్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 2019లో వార్తల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. దీనిపై ప్ర‌స్తుతం సుప్రీం కోర్టు ఒక‌క‌మిటీని వేసి విచార‌ణ జ‌రిపిస్తోంది.

టీడీపీ వాద‌న ఇదీ..

ఏపీలో అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. పెగాస‌స్ స్పైవేర్‌ను కొనుగోలు చేసింద‌ని మ‌మ‌త చెప్పారు. అయితే.. దీనికి సంబంధించి ఆధారాలు ఆమె చెప్ప‌లేదు. అయితే, ఏపీలో మాత్రం రాజ‌కీయ మంట‌లు రేగుతున్నాయి. ఈ స్పైవేర్ తాము కొనలేదని టీడీపీ చెబుతోంది. పెగాసస్‌ వార్తల్లో నిజం లేదని, చట్ట వ్యతిరేక పనులను త‌మ నాయ‌కుడు చంద్ర‌బాబు అనుమతించని, స్పైవేర్‌ను వాడితే జగన్ అధికారంలోకే వచ్చేవారా అని చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌ ప్రశ్నించారు. మమతా బెనర్జీకి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్లి ఉండొచ్చు అన్నారు. తాము ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడలేదని చెప్పారు. అయితే.. ఈ స్పైవేర్ ను కొనమని ఆఫర్ వచ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని లోకేష్ చెప్పారు.

సోమిరెడ్డి వాద‌న

మేము అధికారంలో ఉన్నప్పుడు పోన్లు ట్యాంపింగ్ చేసింది నిజం కాదని టీడీపీ సీనియ‌ర్ నేత సోమిరెడ్డి కూడా చెప్పారు. అయితే.. ఇప్పుడు వైసీపీ హ‌యాలోనే టీడీపీ నేతలు, కొందరు అధికారుల ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయన్నారు. వైసీపీ పార్టీ పరంగా ఈ సాఫ్ట్వేర్ వాడుతోందనేది త‌మ‌కు అనుమానంగా ఉంద‌న్నారు. వైసీపీకి ఎన్నిక‌ల స‌ల‌హాదారుగా ప‌నిచేసిన ప్ర‌శాంత్ కిశోర్‌.. మ‌మ‌త‌కు ఇలా నూరి పోసి ఉంటార‌ని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

మ‌మ‌తా ఊరికేనే ఆ వ్యాఖ్య‌లు చేశారా?

టీడీపీ వాద‌న‌ను బ‌ట్టి.. మ‌మ‌తా బెన‌ర్జీ ఆ వ్యాఖ్య‌లు ఊరికేనే చేశారా? అని వైసీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తు్న్నారు. అంతేకాదు.. మమతపై పరువు నష్టం దావా వేస్తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌మ ఫోన్లు ట్యాప్‌ చేశారని ఎన్నికలకు ముందే చెప్పామని అంబ‌టి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. చంద్ర‌బాబు హ‌యాలో ఏపీ ఇంటెలిజిన్స్ చీఫ్ గా ప‌నిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందేమో.. అని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. పెగాసస్‌ తరహాలో రాజకీయ నేతలు, ప్రతిపక్షాలపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన నిఘా పెట్టిందనేది వారి ఆరోప‌ణ‌లు. అప్పటి ఇంటెలిజెన్స్‌ ఛీప్‌ ఏబీ వెంకటేశ్వరావు ఏరోసాట్, యూఏవీల కొనుగోలు కోసం రూ.25.5 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ విషయం బహిర్గతం కావడంతో పాటు కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక ఆధారాల్లో వెల్లడైందని వైసీపీ సర్కార్ చెబుతోంది. అంతే కాదు వెంకటేశ్వర రావును సస్పెన్సన్ విధించింది.

రాజ‌కీయం ఎటు దారితీస్తుంది?

ప్ర‌స్తుతం రాజ‌కీయంగా పుంజుకుంటున్న ద‌శ‌లో టీడీపీపై వస్తున్న ఈ ఆరోప‌ణ‌లు నిజ‌మో కాదో తేల్చేందుకు వైసీపీ సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. దీనిపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అదేస‌మ‌యంలో ఇప్పుడు సుప్రీం కోర్టు ఎలానూ దీనిపై విచార‌ణ చేస్తున్న ద‌రిమిలా.. సుప్రీం కుకూడా దీనికి సంబంధించిన వివ‌రాలు అందించే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ నేత‌లు చెబుతున్నారు. ఇక‌, టీడీపీ త‌ర‌ఫున ఏం చేస్తార‌నేది చూడాలి. ఏదేమైనా.. రాష్ట్రంలో ఉన్న వివాదాల‌కు తోడు కొత్త‌గా వ‌చ్చిన వివాదం.. మ‌రింత దుమారం రేప‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.