Begin typing your search above and press return to search.

బాబూ... ఈ రాజీనామాల‌ లొల్లి ఏంటీ?

By:  Tupaki Desk   |   27 Sep 2017 8:30 AM GMT
బాబూ... ఈ రాజీనామాల‌ లొల్లి ఏంటీ?
X
ఏపీలో అధికార పార్టీ టీడీపీ రాజ‌కీయాలు రంగు మారుతున్నాయి. కొంద‌రు బెదిరింపు రాజ‌కీయాలకు దిగుతుంటే - మ‌రికొంద‌రు ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్టే రాజ‌కీయాలు చేస్తున్నారు. మొత్తంగా ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు - ఎంపీలు ప్ర‌జ‌లతో బాగానే ఆడేసుకుంటున్నారు. నిన్న‌టికి నిన్న అనంతపురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి వైఖ‌రి తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ఎంపీగా ఉండి ప‌నులు చేయించుకోలేని ఆయ‌న రాజీనామా డ్రామాకు తెర‌తీశారు. త‌న నియోజ‌క‌వ‌ర్గానికి నీరు ఇవ్వాల‌ని ఆయ‌న అధినేత చంద్ర‌బాబు పీక‌ల‌పై కూర్చుని చేయించే ధైర్యం లేక ఏకంగా మ‌న‌స్సాక్షి - ఆత్మ వంచ‌న‌ - ఉప‌యోగం ఏమిటి? వ‌ంటి భారీ సెంటిమెంట్‌ ను రంగ‌రించి రాజీనామా డ్రామాకు తెర తీశారు. ఇక‌, ఇప్పుడు చాగ‌ల్లుకు నీరివ్వ‌డంతో ఈ డ్రామాకు తెర‌ప‌డింది.

ఇక‌, ఇప్పుడు తాజాగా పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ ఎంపీ మాగంటి బాబు - మాజీ మంత్రి పీతల సుజాత వ‌ర్గాలు కూడా రాజీనామాల‌కు తెర‌తీశాయి. మార్కెట్ కమిటీ ఛైర్మెన్ నియామకం విషయంలో త‌లెత్తిన విభేదాలు రాజీనామా వ‌ర‌కు వెళ్లాయి. అయితే, ఇదంతా కేవ‌లం లొల్లేన‌ని - ప్ర‌జ‌ల చెవుల్లో క్యాలీఫ్ల‌వ‌ర్లు పెట్ట‌డ‌మేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. విష‌యంలోకి వెళ్తే.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి విష‌యంలో ఇద్ద‌రికీ ఆధిప‌త్యం అడ్డొచ్చింది. ఈ విష‌యం పీతల వర్గీయులకు - మాగంటి బాబు వర్గీయులకు మ‌ధ్య వివాదం ఏర్ప‌డింది.

తన అసెంబ్లీ నియోజకవర్గంలో మాగంటి పెత్తనం ఏమిటని పీతల సుజాత ప్రశ్నిస్తున్నారు. మాగంటి బాబు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు స‌మాచారం. జిల్లాలో పార్టీని నష్టపర్చేలా మాగంటి బాబు వర్గీయులు వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే, మాగంటి వ‌ర్గంలోని ఇద్ద‌రు జెడ్పీటీసీలు - 17 మంది ఎంపీటీసీలు పీతల వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం రాజీనామా చేశారు. దీనిపై పీతల సుజాత వర్గం తీవ్రంగా స్పందించింది. రెండు వర్గాల మధ్య మాటల యుద్దం సాగుతోంది. మొత్తం మీద టీడీపీ నేత‌లు ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెడుతున్నార‌నే వాద‌న మాత్రం బ‌లంగా వినిపిస్తోంది.