Begin typing your search above and press return to search.

పవన్ ను మరోసారి టచ్ చేసిన తమ్ముడు

By:  Tupaki Desk   |   2 Sept 2015 9:49 AM IST
పవన్ ను మరోసారి టచ్ చేసిన తమ్ముడు
X
అవసరమైన విషయాల కంటే.. అనవసర అంశాల్ని టచ్ చేసే ధోరణి తెలుగు తమ్ముళ్లకు ఎక్కువైంది. అధినేత తీరుకు భిన్నంగా వ్యవహరిస్తూ.. లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవటం అలవాటైంది. మొన్నామధ్య పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ల మీద వ్యాఖ్యలు చేసిన మంత్రి యనమల రామకృష్ణుడు దానికి ఎన్ని తలనొప్పులు వచ్చాయో అందరికి తెలిసిందే.

తన గురించి ఎవరైనా.. ఏదైనా వ్యాఖ్య చేస్తే సమయం చూసుకొని తీవ్రస్థాయిలో ప్రశ్నించే పవన్ కల్యాణ్ ను కదిలించుకోకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని తమ్ముళ్లు మర్చిపోతున్నారు. పవన్ కు ఎంత పరపతి ఉంటే.. ఆయన చెప్పినట్లే (ఆదేశించినట్లుగా) భూసేకరణ విషయంలో ఏపీ సర్కారు వెనక్కి తగ్గుతుంది. ఇలాంటి విషయాల్ని చూసైనా ఆచితూచి మాట్లాడాల్సి ఉన్నా.. అనవసరంగా మాట్లాడుతూ లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటున్నారు.

తాజాగా జరుగుతున్న ఏపీ శాసన మండలి సమావేశాల్లో భాగంగా.. ఇటీవల ఎమ్మెల్సీ గా బాధ్యతులు చేపట్టిన పయ్యావుల కేశవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ వల్ల కానీ.. మరే ఇతర పార్టీల కారణంగా తెలుగుదేశం పార్టీకి ఓట్ల శాతం పెరగలేదని వ్యాఖ్యానించారు. కరవుపై మండలిలో జరుగుతున్న చర్చ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేత.. ప్రతిపక్ష నేత రామచంద్రయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో భయంకరమైన కరవు నెలకొన్నా ప్రభుత్వం పట్టనట్లు ఉంటోందని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా గత ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి అభ్యర్థి మోడీ గడ్డం.. సినీనటుడు పవన్ కల్యాణ్ కాళ్లు పట్టుకొని అధికారంలోకి వచ్చారని విరుచుకుపడ్డారు. దీనికి బదులిచ్చే క్రమంలో పవన్ కల్యాణ్ కారణంగా తమకు ఓట్ల శాతం పెరగలేదని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. మిత్రుడి గురించి గొప్పగా చెప్పకున్నా ఫర్లేదు.. కానీ.. చిన్నబుచ్చేలా మాట్లాడటం తెలుగు తమ్ముళ్లకే సాధ్యమవుతుందేమో.