Begin typing your search above and press return to search.

అలా అయితే లీజు ర‌ద్దుచేస్తానంటున్న‌ప‌వ‌న్‌

By:  Tupaki Desk   |   14 Dec 2017 12:56 PM GMT
అలా అయితే లీజు ర‌ద్దుచేస్తానంటున్న‌ప‌వ‌న్‌
X
మంగళగిరిలో పార్టీ కార్యాలయం నిర్మించేందుకు జ‌న‌సేన పార్టీ, ఆ పార్టీ ర‌థ‌సార‌థి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిద్ధ‌మైన నేప‌థ్యంలో...ఆ స్థలం వివాదాస్పదమైన సంగ‌తి తెలిసిందే. మంగళగిరి మండలం చినకానిలో 3 ఎకరాల స్థలం పవన్ లీజుకున్నార‌ని అయితే..సర్వే నంబర్ 182/1 లోని పది ఎకరాల భూమి తమదని ముస్లిం కుటుంబం తెలిపింది. వివాదంలో ఉన్న భూమిని యార్లగడ్డ సాంబశివరావు పవన్ కి లీజుకిచ్చారని - దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా పవన్ తీసుకున్నారని వారు వెల్ల‌డించారు. 1920 నుండి ఈ స్థలం తమ అధీనంలోనే ఉందని ముగ్దుం మొహిద్దీన్ - జిక్రియా వారసులు వాపోయారు.

ఈ వార్త మీడియాలో పెద్ద ఎత్తున హైలెట్ అయిన నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. అవ‌స‌ర‌మైతే లీజ్ రద్దు చేసుకుంటామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఈ మేర‌కు ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. జనసేన పార్టీ కార్యాలయం కోసం మంగళగిరికి సమీపంలోని చిన కాకాని వద్ద లీజు కు తీసుకున్న స్థలంపై విజయవాడలో ఈ రోజు అంజుమన్ ఇస్లామిక్ కమిటీ సభ్యులు చేసిన ఆరోపణలు త‌న దృష్టికి వచ్చాయని ప‌వ‌న్ వెల్ల‌డించారు. ఇక్కడ స్థలం తీసుకున్న సంగతి పత్రికా ముఖంగా జనసేన వెల్లడించింద‌ని ప‌వ‌న్ తెలిపారు. `ఆనాడే ముస్లిం పెద్దలు తమ గళం విప్పి ఉంటే బాగుండేది లేదా ఈనెల 8 - 9 తేదీల్లో నేను విజయవాడలోనే ఉన్నాను. ఆ సమయంలో నాకు గాని పార్టీ ప్రతినిధులకు గాని తెలియచేసి ఉండవలసింది లేదా కనీసం తొమ్మిదో తేదీన నేను స్థల సందర్శనకు వచ్చినప్పుడన్నా చెప్పవచ్చుగదా?` అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.

చట్టం - న్యాయంపై అపార గౌరవం ఉన్నజనసేన పార్టీ కానీ - తాను కానీ అధర్మబద్దమైన పనులు చేయాలన్న ఆలోచన కూడా కనీసం చేయబోమని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. `కానీ ఈ రోజ ఒక రాజకీయవేత్త సమక్షంలో ఈ విషయాన్ని మీడియా వారితో మాట్లాడడం అనుమానించవలసి వస్తోంది. ఇది రాజకీయ కుట్ర అయితే తట్టుకునే శక్తి జనసేనకు ఉంది. గట్టిగా పోరాడే బలం కూడా ఉంది. ఈ స్థలాన్ని కేవలం మూడున్నర సంవత్సరాల పాటు ఉపయోగించుకోవడానికి మాత్రమే జనసేన లీజ్ కు తీసుకున్న సంగతి తెలిసిందే. అందువల్ల జనసేనకు ఈ స్థలం విషయంలో దురుద్దేశాలు లేవన్న సంగతి చెప్పకనే తెలుస్తోంది. త్వరలోనే న్యాయ నిపుణలతో కలసి జనసేన ప్రతినిధులు చిన కాకాని వస్తారు. మీ వద్దనున్న డాక్యుమెంటు వారికి ఇవ్వండి. ఆ స్థలం మీదని నిర్ధారణ అయిన మరుక్షణం జనసేన ఆస్థలానికి దూరంగా ఉంటుందని హామీ ఇస్తున్నాను. జైహింద్` అని ప‌వ‌న్ వెల్ల‌డించారు.