Begin typing your search above and press return to search.

ట్రెండింగ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్.. కార‌ణ‌మిదే!

By:  Tupaki Desk   |   9 July 2022 2:45 AM GMT
ట్రెండింగ్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్.. కార‌ణ‌మిదే!
X
ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓవైపు సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలు చేస్తూ రెండు ప‌డ‌వ‌ల మీద విజ‌య‌వంతంగా స్వారీ చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా త‌న వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే సినిమాల కంటే రాజ‌కీయాల‌కే ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారు. ఓవైపు జ‌న‌సేన కౌలు రైతు భ‌రోసా యాత్ర‌తో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న ప‌వ‌న్.. మ‌రోవైపు జ‌న‌వాణి కార్య‌క్ర‌మం పేరుతో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌తి ఆదివారం అర్జీలు స్వీక‌రించే కార్య‌క్ర‌మానికి కూడా శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే.

కాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ సోష‌ల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. మిగిలిన పార్టీల మాదిరి త‌న‌కు మీడియా బ‌లం లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియానే విరివిగా వినియోగించుకుంటూ వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై స‌మ‌ర శంఖం పూరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ డీపీ మార్చారు. దీంతో ఒక్క‌సారిగా అది నేష‌న‌ల్ వైడ్ ట్రెండింగ్ గా మారింది.

సాధార‌ణంగా హీరోలు, హీరోయిన్లు త‌ర‌చూ త‌మ ప్రొఫైల్ డీపీలు మారుస్తుంటారు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ మార్చ‌క దాదాపు నాలుగేళ్లు అవుతోంది. అప్ప‌టి నుంచి పూర్తి గ‌డ్డంతో ఉన్న ఒకటీ డీపీ ఆయ‌న ట్విట్ట‌ర్ ప్రొఫైల్ పిక్ గా ఉండేది.

మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ త‌న డీపీని మార్చ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. వైట్ అండ్ వైట్ లో లైటుగా నెరిసిన గ‌డ్డం, మీసం, జుట్టుతో తీక్ష‌ణ చూపుల‌తో కూడిన ప‌వ‌న్ క‌ల్యాణ్ డీపీ నెటిజ‌న్ల‌ను ఓ రేంజులో క‌ట్టిప‌డేస్తోంది. ఇక ప‌వ‌న్ అభిమానుల సంద‌డి అయితే చెప్పాల్సిన ప‌ని లేదు. లైకులు, షేర్లు, కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు. అలాగే ప‌వ‌న్ పెట్టుకున్న డీపీని త‌మ సోష‌ల్ మీడియా ఖాతాల‌కు పెట్టుకుని సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు ప‌వ‌న్ డీపీ వైర‌ల్ గా మారింది.

స్టార్ హీరోలు అప్పుడప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ పిక్స్ మార్చుతుంటారు. అవును.. వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ ఇష్టం.. మారుస్తారు అనిపించవచ్చు. ఏ హీరో మార్చినా అలాగే అనుకోని వదిలేస్తారు ఫ్యాన్స్. కానీ.. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ డీపీ మార్చితే సోషల్ మీడియాలో ఎన్నడూలేని రచ్చ మొదలైంది. కేవలం ఫోటో మార్చితే ట్రెండ్ అవుద్దా అనిపించవచ్చు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' చేస్తున్నాడు. అలాగే హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ చేస్తున్నారు. తమిళ చిత్రం 'వినోదయ చిత్తం' ను చేయ‌నున్నారు. దీనికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. అలాగే ఈ చిత్రంలో ప‌వ‌న్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ఓ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.