Begin typing your search above and press return to search.

న‌వ‌ర‌త్నాల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న న‌వ సందేహాలు ఇవే!

By:  Tupaki Desk   |   8 July 2022 5:56 AM GMT
న‌వ‌ర‌త్నాల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఉన్న న‌వ సందేహాలు ఇవే!
X
జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ జోరు పెంచేశారు. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా త‌నదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఓవైపు జ‌న‌సేన పార్టీ కౌలు రైతు భ‌రోసా యాత్ర‌తో జిల్లాల‌ను చుట్టేస్తున్నారు. మ‌రోవైపు జ‌న‌వాణి పేరుతో తానే స్వ‌యంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై అర్జీలు కూడా స్వీక‌రిస్తున్నారు. ఇప్ప‌టికే కౌలు రైతు భ‌రోసా యాత్ర‌ను నాలుగు జిల్లాలు.. ప్ర‌కాశం, క‌ర్నూలు, అనంత‌పురం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేశారు. ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డ కౌలు రైతు కుటుంబాల‌కు ల‌క్ష రూపాయ‌ల చొప్పున నిధులు అంద‌జేశారు.

ఎప్ప‌టిక‌ప్పుడు ప‌వ‌న్ సోష‌ల్ మీడియాలో వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వాన్ని దునుమాడుతున్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను, త‌ప్పుల‌ను సోష‌ల్ మీడియా సాక్షిగా ఎత్తిచూపుతున్నారు. తాజాగా న‌వ‌ర‌త్న ప‌థ‌కాల‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న ట్వీట్ చేశారు. వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన నవ‌ర‌త్నాల‌పై త‌న‌కు న‌వ సందేహాలున్నాయంటూ వాటిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.

మొదటి రత్నం.. రైతు భరోసా: 64 లక్షల మందికి మేలు అని చెప్పి.. 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా?.. మూడళ్లలో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 700 మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా?

రెండో రత్నం.. అమ్మ ఒడి: 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్దపు ప్రచారం చేస్తున్నారు?

మూడో రత్నం.. పెన్షన్లు: పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?

నాలుగో రత్నం.. సంపూర్ణ మద్యపాన నిషేధం: మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు.. 2021-22లో రూ.22 వేల కోట్లు.. ఇదేనా మ‌ద్య‌నిషేధం? ఈ ఆదాయం చూపించే రూ. 8 వేల కోట్ల బ్రాండ్లు అమ్మలేదా?

అయిదో రత్నం.. జల యజ్ఞం: పోలవరం ప్రాజెక్టును 'యుద్ధ ప్రాతిపదికస‌న‌ ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా?

ఆరో రత్నం.. ఆరోగ్యశ్రీ: ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆస్పత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయి?.. సీఎంఆర్ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు?

ఏడో రత్నం.. ఫీజు రీయింబర్స్మెంట్: రీయింబర్స్మెంట్ చేయకపోవడం వల్ల‌ విద్యార్థులకు హాల్ టికెట్స్ ఆపేస్తున్న మాట నిజం కాదా? పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు?

ఎనిమిదో రత్నం.. పేదలందరికీ ఇళ్ళు: చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా?! ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందుకు మంజూరు చేయలేదు?

తొమ్మిదో రత్నం.. ఆసరా: పొదుపు సంఘాల సంఖ్యను ఏటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు? అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయి? అంటూ పవన్ ట్వీట్ చేశారు.