Begin typing your search above and press return to search.

మోడీ బ‌డ్జెట్‌ ను కొత్త‌గా విశ్లేషించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

By:  Tupaki Desk   |   2 Feb 2022 4:30 AM GMT
మోడీ బ‌డ్జెట్‌ ను కొత్త‌గా విశ్లేషించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
X
క‌రోనా క‌ల్లోలంలో కుదేలై ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా కోలుకుంటున్న పేద- మ‌ధ్య‌త‌ర‌గ‌తి- ఉద్యోగ‌వ‌ర్గాలు ఎంతో ఆశ‌గా ఎదురుచూసిన కేంద్ర బ‌డ్జెట్ వారికి ఆశించిన లేదా ప్ర‌స్తుత త‌రుణంలో అవ‌స‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు చేయ‌డంలో విఫ‌ల‌మైంద‌న్న వాద‌న‌లు ఓ వైపు వినిపిస్తున్న త‌రుణంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ బ‌డ్జెట్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురించి ప‌వ‌న్ కొత్త లెక్క‌లు తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు. కేంద్ర బ‌డ్జెట్‌ను కీర్తిస్తూ ప‌వ‌న్ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇందులో త‌న అభిప్రాయాల‌ను ప‌వ‌న్ ఒకింత నిక్క‌చ్చిగానే వెల్ల‌డించారు.

కేంద్ర బడ్జెట్లో ప్రజలకు వ్యక్తిగత ప్రయోజనాలు లేనప్పటికీ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేసిన‌ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వాన్ని, ముఖ్యంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను జనసేన పార్టీ అభినందిస్తోందని ఓ ప్ర‌క‌ట‌న‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజలపై కొత్తగా పన్నుల భారం వేయకుండా బడ్జెటును రూపొందించార‌ని, అయితే, ఆదాయపు పన్ను పరిమితిని ఈసారి బడ్జెట్లో పెంచుతారని ఎదురుచూసిన ఉద్యోగులు నిరాశకు గురయ్యారని ప‌వ‌న్ విశ్లేషించారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక కేటాయింపులు చేసి ఉంటే బాగుండేదని జనసేన భావిస్తోందన్నారు. స్థూలంగా ఉత్పాదక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కేంద్ర బడ్జెటును బీజేపీని ప్రభుత్వం రూపకల్పన చేయడం ఆశావహ పరిణామమ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వివ‌రించారు.

బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలు చోటుచేసుకోకపోవడం కొంత నిరాశను కలిగించిందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలకు లక్ష కోట్ల రూపాయలతో నిధి, అదేవిధంగా 50 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా లక్ష కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్రాలు తీసుకునే అవకాశం రాష్ట్రాలకు మేలు చేస్తుందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కావాలని జనసేన కోరుకుంటోందని ప‌వ‌న్ తెలిపారు. ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు కొత్తగా కల్పిచాలని ఈ బడ్జెట్లో పేర్కొనడాన్ని జనసేన స్వాగతిస్తోందన్నారు.

గ‌త రెండేళ్లుగా కరోనా కారణంగా ఎన్నో కష్టనష్టాలు చవిచూస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా కాపాడిన వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వడం రైతన్నలకు భరోసా కల్పించడంగా జనసేన భావిస్తోందని ప‌వ‌న్ తెలిపారు. ఆధునిక వ్యవసాయం దిశగా వేసే అడుగుల వేగం పెరిగిందని అవగతమవుతోంది. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు, అద్దె ప్రాతిపదికన రైతులకు వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అందించడం, వ్యవసాయ స్టార్టప్ లకు ప్రోత్సాహకాలు వంటివి వ్యవసాయ రంగానికి.. తద్వారా రైతులకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. అయితే 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని గత బడ్జెట్లో ప్రకటించిన ప్రభుత్వం ఆ హామీకి ఎంత చేరువ అయ్యారో ఈ బడ్జెట్లో ప్రస్తావించి ఉంటే బేరీజు వేసుకోడానికి వీలుండేదని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తావించారు.