Begin typing your search above and press return to search.

ఎనిమిదో పెళ్లికి రెఢీ అయిన కి‘లేడీ’నే కావాలట

By:  Tupaki Desk   |   16 Jun 2016 4:42 AM GMT
ఎనిమిదో పెళ్లికి రెఢీ అయిన కి‘లేడీ’నే కావాలట
X
మాయమాటలు చెప్పి అమాయక ఆడాళ్లను మోసం చేసే మగరాయళ్లు మామూలే. అందుకు భిన్నంగా మగాళ్లను బకరాలు చేసి.. వారిని పెళ్లిళ్లు చేసుకుంటూ భారీగా డబ్బు లాగేసే కిలేడీ పవిత్ర వ్యవహారం తాజాగా బయటకు వచ్చింది. తమిళనాడుకు చెందిన ఈ కిలేడీ వ్యవహారం వింటేనే షాకింగ్ గా ఉంటుంది. ఇప్పటికి ఏడుగుర్ని పెళ్లి చేసుకొని.. వారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున నగదు.. నగలు కాజేసి జంప్ అయిపోయే 32 ఏళ్ల పవిత్ర తాజాగా ఎనిమిదో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం కావటం.. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని అమ్మడి గుట్టును రట్టు చేశారు.

నిజానికి అమ్మడి యవ్వారం ఏడో భర్త చేసిన ఫిర్యాదు కారణంగా బయటకు వచ్చింది. తిరుపూర్ జిల్లా తారాపురం సమీపంలోని కోణప్పన్ సాలై గ్రామానికి చెందిన సెల్వకుమార్ తన భార్య గత నెల 27 నుంచి కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉడుమలైలో ‘పవిత్ర’ను పట్టుకున్నారు. అనంతరం విచారణలో భాగంగా ఆమె చెప్పిన మాటల్ని విన్న పోలీసులకు సైతం నోట మాట రాని పరిస్థితి.

ఇప్పటికే ఆమెకు ఏడు పెళ్లిళ్లు అయ్యాయని.. మాయమాటలు చెప్పి.. అమాయక మగాళ్లను పెళ్లి చేసుకోవటం.. వారితో కొన్ని రోజులు గడిపి.. నగలు.. నగదు చేజిక్కించుకొని చెక్కేయటం ఆమెకు అలవాటన్న విషయాన్ని గుర్తించారు. ఈ వ్యవహారంలో ఆమె మొదటి భర్త సాయం చేస్తుంటాడని గుర్తించారు. ఆమె భాగోతాన్ని విన్న పోలీసులు ఏడో భర్త నుంచి దొంగలించిన నగదు.. నగల్ని ఇప్పించి ఆమెను వదిలేశారు.

ఈ చిత్రమైన ఎపిసోడ్ లో కొసమెరుపు ఏమిటంటే.. ఇప్పటికే ఏడు పెళ్లిళ్లు చేసుకొన్న పవిత్ర.. తాజాగా ఎనిమిదో పెళ్లికి సిద్ధం కావటం.. ఆమె భాగోతం మొత్తం బయటకు వచ్చినప్పటికీ.. ఎనిమిదో పెళ్లి కొడుకు మాత్రం పవిత్రను పెళ్లి చేసుకోవటానికి సిద్ధం కావటమే కాదు.. తన పెళ్లిని ఆమెతో ఎలాగైనా చేయాలంటూ పోలీసుల్ని కోరటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె పెద్ద కిలేడీ అని చెప్పినా.. ఫర్లేదు సార్.. ఆమెతో నాకు పెళ్లి చేయాలని కోరుతున్న ఎనిమిదోపెళ్లి కొడుకు తీరుకు పోలీసులు తలలు పట్టుకొంటున్నారు. ఆమె భాగోతం చెప్పి.. అతగాడ్ని హెచ్చరించి వదిలేశారు. ఏడు పెళ్లిళ్లు చేసుకొని మోసం చేసినా పవిత్రకు ఉన్న డిమాండ్ చూసి పోలీసుల నోట నుంచి మాట రావటం లేదట.