Begin typing your search above and press return to search.

ఎద్దుల‌తో విద్యుత్ ఉత్ప‌త్తి..

By:  Tupaki Desk   |   17 May 2017 10:06 AM GMT
ఎద్దుల‌తో విద్యుత్ ఉత్ప‌త్తి..
X
ఇటీవ‌లి కాలంలో మార్కెట్లో దూకుడుగా ముందుకు సాగుతున్న యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన‌ ప‌తంజ‌లి మ‌రో సంచ‌ల‌నానికి తెర తీయ‌నున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎద్దుల‌ను ఉప‌యోగించి విద్యుత్ ఉత్ప‌త్తి చేసే దిశ‌గా ప‌తాంజ‌లి ముందడుగు వేయ‌డ‌మే ఈ సంచ‌ల‌నం. ఈ వినూత్న విద్యుత్ ఉత్ప‌త్తి దిశ‌గా క్రియాశీలంగా ముందుకు సాగుతూ ఓ అంత‌ర్జాతీయ సంస్థ‌తో ఇప్ప‌టికే ఒప్పందం కుదుర్చుకోవ‌డం విశేషం.

ప‌తంజ‌లికి చెందిన ఉన్న‌త వ‌ర్గాల అభిప్రాయం ప్రకారం ఎద్దుల ఆధారంగా గృహావ‌స‌రాల‌కు స‌రిప‌డ విద్యుత్ ఉత్ప‌త్తి చేసే ప్రాజెక్టు విష‌యంలో భార‌త‌దేశానికి చెందిన ఓ ప్ర‌ముఖ ఆటోమొబైల్ సంస్థతో పాటుగా ట‌ర్కీకి చెందిన మ‌రో కంపెనీతో క‌లిసి ఒప్పందం కుదుర్చుకొని ప‌తంజ‌లి ముందుకు సాగుతోంది. ఈ మేర‌కు గ‌త రెండేళ్లుగా హ‌రిద్వార్‌లోని ప‌తంజ‌లి ప్రాంగ‌ణంలో దీనిపై అధ్య‌య‌నం కొన‌సాగుతోంది. ప్రాథ‌మికంగా ఫ‌లితాలు కూడా సాధించారు.

త‌మ కొత్త ప్ర‌యత్నం గురించి ప‌తంజ‌లి మేనేజింగ్ డైరెక్ట‌ర్ బాల‌కృష్ణ ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ ఎద్దుల‌కు సామ‌ర్థ్యం ఎక్కువ కాబ‌ట్టి వాటిని ఈ ప్ర‌యోగానికి వేదిక‌గా చేసుకున్న‌ట్లు వివ‌రించారు. ఎద్దులతో ట‌ర్బైన్ తిప్ప‌డం ద్వారా విద్యుత్ ఉత్ప‌త్తి అయ్యే ప్ర‌క్రియ‌లో తొలిద‌శ‌లో 2.5 కిలోవాట్ల విద్యుత్ ఉత్ప‌త్తి చేసిన‌ట్లు వెల్ల‌డించారు. రైతుల ఇళ్ల‌లోని స్వ‌ల్ప విద్యుత్ అవ‌స‌రాల‌కు ఈ రూపంలో త‌క్కువ ఖ‌ర్చుతో విద్యుత్ త‌యారీ చేసుకోవ‌చ్చున‌ని బాల‌కృష్ణ తెలిపారు. పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్ప‌త్తిపై తాము దృష్టి సారించ‌లేదని పేర్కొన్నారు. కాగా ఇలా ఎద్దుల‌ను వినియోగంలోకి తేవ‌డం వ‌ల్ల వాటిని క‌బేళాకు త‌ర‌లించ‌డం త‌ప్పుతుంద‌ని విశ్లేషించారు.