Begin typing your search above and press return to search.

‘ఫోర్బ్స్ జాబితాలో బాలకృష్ణ

By:  Tupaki Desk   |   22 Sep 2016 11:41 AM GMT
‘ఫోర్బ్స్ జాబితాలో బాలకృష్ణ
X
షాకయ్యారా... మన బాలయ్య, మన హీరో, మన హిందూపురం ఎమ్మెల్యే భారత దేశ ధనవంతుల జాబితాకెక్కారా అని ఆనందిస్తున్నారా. అభిమానులైతే పండగ చేసుకుంటున్నారా..!! ఫోర్బ్సు ఈ రోజు విడుదల చేసిన 100 మంది భారతీయ ధనవంతుల జాబితాలో బాలకృస్ణది 48వ పేరు. కానీ... ఈ బాలకృష్ణ మన హీరో బాలయ్య కాదు. ఈ ధనిక బాలయ్య బిజినెస్ మేన్ బాలయ్య. ఆయుర్వేద ఉత్పత్తుల వ్యాపారంతో వెల్లువలా సంపాదిస్తున్న బాలయ్య. యోగా గురువు బాబా రాందేవ్ కు వెన్నంటి ఉండి పతంజలి ఉత్పత్తులను కార్పొరేట్ కంపెనీలకు పోటీగా నిలుపుతున్న పక్కా దేశీ వ్యాపారవేత్త ఆచార్య బాలకృష్ణ ఈయన.

పతంజలి ఆయుర్వేదం అనగానే రాందేవ్ బాబా గుర్తొస్తారు కానీ ఆ సంస్థను స్థాపించింది మాత్రం ఆచార్య బాలకృష్ణ. ఫోర్బ్స్ జాబితాలో ఆయన తొలిసారిగా స్థానం సంపాదించారు. సుమారు రూ.16,000 కోట్ల సంపద కలిగి ఉన్న ఆచార్య బాలకృష్ణ వయసు 44. భారత్ లో పతంజలి సంస్థ ఉత్పత్తుల వినియోగం వేగంగా పెరుగుతోందని, దీని నికర విలువ ఆధారంగా, సంస్థలో 92 శాతం వాటాను కలిగి ఉన్న బాలకృష్ణను ఈ జాబితా కింద ఎంపిక చేసినట్లు ఫోర్బ్స్ పేర్కొంది.

కాగా, పతంజలి సంస్థలో రాందేవ్ బాబాకు వాటాలున్నప్పటికీ, ఈ సంస్థ కార్యకలాపాలు నడిపే వ్యక్తి మాత్రం బాలకృష్ణే. పతంజలి అడ్వర్టయిజ్ మెంట్లలో కూడా బాలకృష్ణ రాందేవ్ బాబా పక్కనే కనిపిస్తారు. మొత్తానికి ఆయుర్వేదంతో అద్భుతాలు సృష్టించడం గొప్ప విషయమే.