Begin typing your search above and press return to search.

పతంజలి యూ టర్న్ ...అది కరోనా మందు కాదట !

By:  Tupaki Desk   |   30 Jun 2020 1:30 PM GMT
పతంజలి యూ టర్న్ ...అది కరోనా మందు కాదట !
X
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వైరస్ కి మందు కనిపెట్టాం అంటూ సంచలన ప్రకటన చేసిన ఆయుర్వేద కంపెనీ పతంజలి నిర్వాహకులు తాజాగా యూటర్న్‌ తీసుకున్నారు. మేము వైరస్ నివారణకు ఎలాంటి మెడిసిన్‌ తయారు చేయలేదంటూ మాట మార్చారు. ‘కరోనా కిట్‌’ పేరిట ఎలాంటి అమ్మకాలు చేపట్టలేదని మంగళవారం తెలిపారు.

ఈ ప్రాణాంతక వైరస్ ను కట్టడి చేసేందుకు కరోలిన్‌ అనే మందును కనిపెట్టినట్లు పతంజలి కంపెనీ గత మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. యోగా గురువు రాందేవ్‌ బాబా పతంజలి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ ‌లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని తెలియజేసారు. అదేకాదు , వైరస్ లక్షణాలు కలిగి ఉన్న వంద మంది రోగులపై ఈ మందును ప్రయోగించగా...వారిలో దాదాపు 65 మంది పూర్తిగా కోలుకున్నారని పతంజలి కంపెనీ తెలిపింది.

ఈ క్రమంలో పతంజలి తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారంటూ రాందేవ్‌ బాబా, పతంజలి చైర్మన్‌ బాలకృష్ణ పై పలువురు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కరోనిల్‌ ప్రకటనలను భారత ఆయుష్‌ మంత్రిత్వ శాఖ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయంపై స్పందించిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం.. ఈ మహమ్మారి నిరోధక మందుల తయారీకి పతంజలి కంపెనీ ఎలాంటి లైసెన్స్‌లు తీసుకోలేదని, దగ్గు నివారణ మందనుకొనే తాము కరోలిన్‌ మందుకు అనుమతించామని తెలిపింది.

ఈ క్రమంలో కరోలిన్‌ మందుపై వివరణ ఇవ్వాల్సిందిగా.. ఉత్తరాఖండ్‌ డ్రగ్‌ డిపార్ట్‌మెంట్‌ పతంజలి సంస్థకు నోటీసులు జారీచేసింది. దీనిపై ఆ సంస్థ స్పందిస్తూ ...కరోనా కిట్‌ పేరును ఎక్కడా వాడటం లేదు. మందును తయారు చేయలేదు. దివ్య స్వసారి వతి, దివ్య కరోనిల్‌ టాబ్లెట్‌, దివ్య అను టేల్‌ అనే మెడిసిన్‌తో కూడిన ప్యాకేజీ మాత్రమే షిప్పింగ్‌ చేస్తున్నాం. కరోనిల్‌ కిట్‌ అనే కిట్‌ను విక్రయించడం లేదు. అంతేకాదు.. అది వైరస్ చికిత్సకు ఉపయోగపడుతుందని కూడా ఎలాంటి పబ్లిసిటీ చేయలేదు. కేవలం ఈ మందులకు సంబంధించిన ప్రయోగం విజయవంతమైన విషయాన్ని మాత్రమే మీడియా ముందు తెలిపాం. కేవలం ఈ ఔషధం చేకూర్చే ప్రయోజనాల గురించి మాత్రమే వెల్లడించాం. మనుషులపై ప్రయోగించినపుడు సత్ఫలితాలు ఇచ్చిందనే చెప్పామే తప్ప.. ఇది కరోనాను నయం చేస్తుందని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు అని తెలిపింది.