Begin typing your search above and press return to search.

మాజీ మంత్రి.. ఆమె.. ఇద్దరూ కోర్టులో ఏడ్చేసిన బెయిల్ రాలేదు

By:  Tupaki Desk   |   15 Sep 2022 4:52 AM GMT
మాజీ మంత్రి.. ఆమె.. ఇద్దరూ కోర్టులో ఏడ్చేసిన బెయిల్ రాలేదు
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారి.. పెద్ద ఎత్తున కథనాలు రావటమే కాదు.. పశ్చిమ బెంగాల్ లోని మమత ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన పాఠశాల ఉద్యోగుల నియామకం స్కాంలో అరెస్టు అయిన మాజీ మంత్రి పార్థా చటర్జీతో పాటు ఆయనకు సన్నిహితురాలైన సినీ నటి అర్పితా ముఖర్జీలు ఇద్దరూ కోర్టులోనే ఏడ్చేశారు. ఎవరికి వారు తామిద్దం అమాయకులమని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కోర్టు మాత్రం వారిద్దరికి వేర్వేరుగా మరో 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

పార్థా ఛటర్జీ మంత్రిగా పదవిని వెలగబెట్టిన వేళలో..ఆయనకు సన్నిహితురాలైన సినీ నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టల్ని స్వాధీనం చేసుకోవటం దేశ వ్యాప్తంగా సంచనలమైన సంగతి తెలిసిందే. తాజాగా జైల్లో ఉంటున్న వారు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరి బెయిల్ పిటిషన్ పై విచారణకు వచ్చిన వేళ.. ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు. రాజకీయాలకు తాను బలైనట్లుగా వాపోయారు.

2014-21 మధ్య కాలంలో పార్థా ఛటర్జీ విద్యాశాఖా మంత్రిగా ఉండగా బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించటంతోపాటు.. ఆయనకు అత్యంత సన్నిహిరాలైన సినీ నటి అర్పితా ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో రూ.50 కోట్ల భారీ మొత్తం బయటపడటం.. దాన్ని ఈడీ అధికారులు రికవరీ చేయటం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన.. అర్పితా ఇద్దరిని అరెస్టు చేశారు. జైల్లో ఉన్న వారు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనికి సంబంధించిన విచారణ తాజాగా జరగ్గా.. ఆ సందర్భంలో తానో అర్థిక శాస్త్ర విద్యార్థినని.. ఎల్ ఎల్ బీ స్టూడెంట్ నని.. బ్రిటిష్ స్కాలర్ షిప్ కూడా పొంది.. ఉన్నత విద్యను అభ్యసించిన తాను ఇలాంటి స్కాంలో ఎలా భాగం కాగలను? అంటూ పార్థా ఛటర్జీ కోర్టులో వాపోయారు. మంత్రిని కాక ముందే తాను ప్రతిపక్ష నేతనని.. కానీ ఇప్పుడు రాజకీయాలకు బలైనట్లుగా చెప్పుకున్నారు. తనకు ప్రశాంతంగా జీవించాలని ఉందని.. తన జీవితాన్ని తాను గడిచేలా అనుమతించాలని.. బెయిల్ ఇవ్వాలని కోరగా.. కోర్టు ఆ విన్నపాన్ని నిరాకరిస్తూ ఆయనకు మరో పద్నాలుగు రోజులు కస్టడీకి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అనంతరం ఇదే కేసుకు సంబంధించి సినీ నటి అర్పితా ముఖర్జీ సైతం కోర్టుకు హాజరు పర్చారు. బెయిల్ పైన ఆమె పెట్టుకున్న దరఖాస్తును కోర్టు విచారించింది. ఈ సందర్భంగా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇదంతా ఎలా జరిగిందో తనకు అర్థం కావటం లేదని.. అంత డబ్బును తన ఇంట్లో నుంచి ఈడీ అధికారులు ఎలా స్వాధీనం చేసుకున్నారో తెలీటం లేదన్నారు.

దీనికి స్పందించిన న్యాయమూర్తి..''ఆ ఇల్లు మీదేనా? ఆ ఇంటి యజమాని మీరేగా?'' అని ప్రశ్నించగా.. అందుకు ఆమె బదులిస్తూ.. ''ఔను'' అన్నారు. అయితే.. దానికి మీరే సమాధానం చెప్పాలంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ.. ఆమెకు మరో పద్నాలుగు రోజులు జ్యూడిషియల్ కస్టడీని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.