Begin typing your search above and press return to search.

పిల్లల్ని కంటారా? రూ. 5 కోట్లు ఇస్తారా?

By:  Tupaki Desk   |   12 May 2022 5:06 AM GMT
పిల్లల్ని కంటారా? రూ. 5 కోట్లు ఇస్తారా?
X
ముదిమి వయసులో మనవళ్లతో ఆడుకోవాలని.. వారితో ఆనందంగా గడపాలని అందరికీ ఉంటుంది. ఇలా కోరుకునే వృద్ధ దంపతులు ఎంతో మంది ఉంటారు. కానీ కొడుకుకు పెళ్లి చేసి ఐదేళ్లు గడుస్తున్నా వారు పిల్లలను కనకపోవడంతో ఆ వృద్ధ దంపతులు కోర్టుకు ఎక్కారు. తమ కుమారుడు, కోడలు ఏడాదిలోపు బిడ్డకు జన్మనివ్వాలని.. లేదా వారిపై తాము వెచ్చించిన రూ.5 కోట్ల రూపాయలను పరిహారంగా ఇవ్వాలని ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లా కోర్టులో ఆ దంపతులు పిటీషన్ దాఖలు చేశారు.

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ జిల్లా కోర్టులో అరుదైన పిటీషన్ దాఖలైంది. హరిద్వార్ కు చెందిన వృద్ధ దంపతులు తమ కుమారుడు, కోడలు ఏడాదిలోపు బిడ్డకు జన్మనివ్వాలని డిమాండ్ చేశారు. అది నెరవేర్చకపోతే వారిపై తాము ఖర్చు చేసిన రూ. 5 కోట్లను పరిహారంగా చెల్లించాలని పిటీషన్ లో పేర్కొన్నారు.

హరిద్వార్ కు చెందిన సంజీవ్ రంజన్ ప్రసాద్ బీహెచ్ఈఎల్ లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం తన భార్య సాధనతో కలిసి హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నారు. ఆ దంపతుల ఏకైక కుమారుడు శ్రేయ్ సాగర్కు నోయిడా నివాసి శుభాంగి సిన్హాతో 2016లో వివాహం చేశారు. శ్రేయ్ సాగర్ పైలట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వివాహం జరిగి ఆరేళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడం.. ఆ దిశగా కొడుకు-కోడలు ఎలాంటి ప్రయత్నం చేయకపోవడంపై విసిగిపోయిన రంజన్ దంపతులు తాజాగా కోర్టు మెట్లు ఎక్కారు.

తన దగ్గర ఉన్న డబ్బంతా కుమారుడు చదువు కోసమే వెచ్చించానని.. అమెరికాలో శిక్షణ కూడా ఇప్పించానని తెలిపారు. ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులో అప్పు తీసుకున్నానని.. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ వృద్ధ దంపతులు హరిద్వార్ జిల్లా కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తూ అతడి కుమారుడికి పెళ్లి అయ్యి ఆరేళ్లు గడిచినా సంతానం కలుగలేదని చెప్పారు.

కుమారుడు-కోడలు బిడ్డ కోసం ఎలాంటి ప్లానింగ్ చేయడం లేదని తెలిపారు. కుమారుడిని పెంచి సమర్థుడిని చేసేందుకు తమ డిపాజిట్లన్నింటిని పెట్టుబడిగా పెట్టామని వృద్ధ దంపతులు తమ పిటీషన్లో పేర్కొన్నారు. ఈ వయసులో తాము ఒంటరిగా జీవించవలసి వస్తోందని.. ఇది చాలా బాధాకరం అన్నారు.

తమకు కుమారుడు,కోడలు,మనవళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. మగ బిడ్డ, ఆడబిడ్డ అన్నది తమకు పట్టింపుకాదని.. బిడ్డను కనాలని ఆ వృద్ధ దంపతులు డిమాండ్ చేశారు. అలా చేయకుంటే తాము ఖర్చు చేసిన రూ. 5కోట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఈ పిటీషన్ మే 17న విచారణకు రానుంది.