Begin typing your search above and press return to search.

మోడీ కోసం రౌడీ నాయకుడి త్యాగం!

By:  Tupaki Desk   |   18 Sep 2015 4:04 AM GMT
మోడీ కోసం రౌడీ నాయకుడి త్యాగం!
X
కొన్ని తెరవెనుక ఒప్పందాలు, కొన్ని తెరముందు పొత్తులు.. ఎన్ని ఎత్తులు వేసైనా సరే.. బీహార్‌ లో తన శత్రువు నితీశ్‌ కుమార్‌ ను ముఖ్యమంత్రి కానివ్వకుండా చేయాలని నరేంద్రమోడీ గట్టి పట్టుదలతోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి.. బీహార్ లో ఇప్పటికే రకరకాల రాజకీయ పన్నాగాలు నడుస్తూ ఉన్న సంగతి తెలిసిందే. వాటిలో ఇదొక కొత్త పర్వం.

బీహార్‌లో నేరచరిత్ర ఉన్న కీలక నాయకుల్లో పప్పూయాదవ్‌ కూడా ఒకరు. ఒక ప్రాంతంలో రాజకీయాల్ని మొత్తం శాసించే స్థాయికి ఎదిగిన వ్యక్తి పప్పూయాదవ్‌. గతంలో ఆర్జేడీలో ఉన్న పప్పూను తర్వాత పార్టీలోనుంచి బహిష్కరించారు. అయితే మోడీ, భాజపా విజయంకోసం లోపాయికారీగా పప్పూ యాదవ్‌ మద్దతుకు మాట తీసుకున్నట్లు కొన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా పప్పూ చెబుతున్న మాటలు వింటే అది నిజమే అనిపిస్తోంది.

ఇప్పటిదాకా భాజపాతో అధికారికంగా పప్పూయాదవ్‌ స్థాపించిన జన్‌ అధికారి పార్టీకి ఎలాంటి పొత్తు లేదు. అయితే ఆయన ఇప్పుడు లాలూ కూటమి అధికారంలోకి రాకుండా చూసేందుకు అవసరమైతే తాము పోటీ చేయబోమని కూడా వెల్లడిస్తున్నారు. ముందు 243 సీట్లలోనూ రంగంలోకి దిగుతాం అని చెప్పిన పప్పూ యాదవ్‌, ఇప్పుడు మహా అయితే వంద సీట్లు, లేదా అసలు పోటీచేయబోం.. నితీశ్‌ - లాలూలను మాత్రం అధికారంలోకి రానివ్వం అనిచెప్పడం చూస్తోంటే ఆయన త్యాగం మోడీ కోసమే అనిపిస్తోంది.