Begin typing your search above and press return to search.

‘పప్పు’ అనే పదంలో అంత బూతు ఉందా? ఆ అసెంబ్లీలో బ్యాన్

By:  Tupaki Desk   |   10 Aug 2021 10:31 AM GMT
‘పప్పు’ అనే పదంలో అంత బూతు ఉందా? ఆ అసెంబ్లీలో బ్యాన్
X
చట్టసభల్లో అసభ్యకర వ్యాఖ్యలు.. పదాలు వాడటం తప్పు. అలా చేసిన నేతలపై చర్యలు తీసుకోవటం మామూలే. అయితే.. ఎవరూ ఊహించని రీతిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ‘పప్పు’ అనే పదాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ మాటకు వస్తే పప్పు అన్న పదంతో పాటు చోర్.. మిస్టర్ బంటాధర్.. వెంటిలేటర్ లాంటి పదాల్ని.. వ్యాక్యాన్ని అసెంబ్లీలో ఉచ్చరించకూడదని బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

1954 నుంచి ఇప్పటివరకు వరకు ఇలా నిషేధించిన పదాలు.. వ్యాక్యాలు ఆ రాష్ట్ర అసెంబ్లీలో దాదాపు 1161 వరకు ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన 38 పేజీల బుక్ లెట్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా విడుదల చేశారు. పప్పు అనే పదాన్ని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీని అవహేళన చేసేందుకు బీజేపీ నేతలు తరచూ వినియోగించేవారు. కరోనా నేపథ్యంలో వెంటిలేటర్ పదం.. మోడీ సర్కారుకు మహా ఇబ్బందికరంగా మారింది. వెంటిలేటర్ల సమస్య ఆ మోడీ సర్కారుకు ఎంత ఇబ్బందికి గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పప్పు అన్న పదాన్నినిషేధిత జాబితాలో చేర్చిన విషయంపై నోరు మెదపని కాంగ్రెస్.. అనూహ్యంగా వెంటిలేటర్ అన్న పదాన్ని బ్యాన్ చేయటం మీద మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. వెంటిలేటర్ పదాన్ని అసెంబ్లీలో ఎందుకు నిషేధించాలని నిలదీస్తోంది. ‘పప్పు’ అన్న పదం జాతీయ రాజకీయాల్లో రాహుల్ పేరుకు బదులుగా వారి ప్రత్యర్థులు వినియోగిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ ను విమర్శలు చేయటానికి వాడటం తెలిసిందే.
బీజేపీ నేతలు రాహుల్ గాంధీని ఎక్కెసం చేయటానికి పప్పు పదాన్ని విపరీతంగా వినియోగించేవారు. లోకేశ్ ను పప్పు పేరుతో వైసీపీ నేతలు బాగా వాడేస్తుంటారు. సోషల్ మీడియాలోనూ ఇదే పేరుతో తరచూ కామెంట్లు చేయటం తెలిసిందే. వైసీపీ నేతల్లో మంత్రి కొడాలి నాని..ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే ఆర్కే రోజాలు తరచూ వాడేస్తుంటారు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో షర్మిల సైతం లోకేశ్ ను ఉద్దేశించి ‘పప్పు’ అని పిలిచి.. ఎగతాళి చేయటాన్ని మర్చిపోలేం.

చాలా సందర్భాల్లో లోకేశ్ ను ఆయన పరివారాన్ని ఇరిటేట్ చేయటం కోసం.. పప్పు అనే పదాన్ని గూగుల్ లో సెర్ఛ్ చేయాలని.. దానికి సమాధానంగా లోకేశ్ బొమ్మ వస్తుందన్న మాటను వైసీపీ నేతలు తరచూ వ్యాఖ్యానించేవారు. నిజంగానే ఇలా జరగటంతో టీడీపీ నేతలు తరచూ ఇబ్బంది పడేవారు. ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ‘పప్పు’ పదాన్ని బ్యాన్ చేసిన నేపథ్యంలో.. ఏపీ అసెంబ్లీలో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? ఒకవేళ.. ఇలాంటి డిమాండ్ ను టీడీపీ లేవనెత్తితే మాత్రం.. వైసీపీ నేతలకు మరోసారి ‘పప్పు’ పేరుతో విరుచుకుపడటం ఖాయమని చెప్పక తప్పదు.