Begin typing your search above and press return to search.

సెల్వం ఆ టీవీ ఛాన‌ల్ కొనేశాడ‌ట‌

By:  Tupaki Desk   |   4 April 2017 2:17 PM GMT
సెల్వం ఆ టీవీ ఛాన‌ల్ కొనేశాడ‌ట‌
X
అమ్మ వీర విధేయుడిగా పేరొందిన తమిళ‌నాడు మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వం రాజ‌కీయంగా వ్యూహాత్మ‌కంగా క‌దులుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అన్నాడీఎంకే ర‌థసార‌థి క‌మ్ సీఎంగా చ‌క్రం తిప్పాల‌ని భావించిన‌ప్ప‌టికీ చిన్న‌మ్మ శ‌శిక‌ళ అడ్డు ప‌డిన‌ నేప‌థ్యంలో సెల్వం సొంత కుంప‌టి పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. త‌ర్వాతి అడుగులో భాగంగా మీడియా అండ‌గా శ‌శిక‌ళ‌ను, ఆమె వ‌ర్గానికి చెందిన సీఎం ప‌ళ‌నిస్వామిని టార్గెట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం తమిళనాడులో ప్రసారం అవుతున్న మడిప్పాకం విశ్వనాథంకు చెందిన జీ టీవీని పన్నీర్ సెల్వం వర్గీయులు కొనుగోలు చేశారని వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

శ‌శిక‌ళ వ‌ర్గాన్ని దీటుగా ఎదుర్కోవ‌డం, అమ్మ ఆశ‌యాల‌కు అనుగుణంగా ప్ర‌స్తుత స‌ర్కారు న‌డుచుకోవ‌డం లేద‌నే భావ‌న‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి పంపేందుకు టీవీ చానల్ కొనుగోలు చేసిన‌ట్లు చెప్తున్నారు. అమ్మ టీవీ చానల్ ను త్వరలోనే ప్రారంభిస్తామని పన్నీర్ సెల్వం వర్గం ఇప్పటికే ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో మడిప్పాకం వేలాయుధంకు చెందిన జీ టీవీని కొనుగోలు చేశారు. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత ప్రాతినిధ్యం వ‌హించిన‌ ఆర్‌కే న‌గ‌ర్ ఉప ఎన్నిక త‌ర్వాత ఈ ఛాన‌ల్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. జీ టీవీని అమ్మ టీవీగా పేరు మార్చి అధికారికంగా ప్రసారం చెయ్యడానికి పన్నీర్ సెల్వం వర్గీయులు నిర్ణయించారు.

ఉప ఎన్నిక పూర్త‌యిన అనంత‌రం అమ్మ టీవీ 24x7 న్యూస్ చానల్ అని పేరుతో ఈ ఛాన‌ల్ ప్రసారాలు కొన‌సాగనున్నాయి. దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత అభిమానించి ఆశ్ర‌యం క‌ల్పిస్తే శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కలిసి అమ్మకు చేసిన ద్రోహం గురించి ఇక ముందు అమ్మ టీవీ చానల్ లో కథనాలు ప్రసారం అవుతాయని సమాచారం. ఇప్ప‌టికే డీఎంకేకు చెందిన టీవీ ఛాన‌ల్‌, అన్నాడీఎంకేకు చెందిన జ‌య టీవీల మ‌ధ్య పోరాటం సాగుతుండ‌గా ఈ మీడియా వార్‌లోకి సెల్వం కూడా ఎంట్రీ ఇస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/