Begin typing your search above and press return to search.

కాస్త హ్యాక్ చేస్తేనే ఇన్ని ప్రకంపనలు

By:  Tupaki Desk   |   6 April 2016 5:29 AM GMT
కాస్త హ్యాక్ చేస్తేనే ఇన్ని ప్రకంపనలు
X
ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పనామా పేపర్స్ కుంభకోణానికి సంబంధించి ఒక ఆసక్తికర కోణం బయటకు వచ్చింది. పలు దేశాలకు చెందిన వీవీఐపీలు మొదలుకొని ఓ మోస్తరు సెలబ్రిటీల వరకూ తాము కూడబెట్టిన నల్లధనాన్ని గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలించి.. అక్కడ కంపెనీలు పెట్టి.. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు చేసిన కక్కుర్తి పనులు బయటకు రావటం తెలిసిందే.

ఈ పాడు పని చేయటంలో మొసాక్ ఫోన్సెకా ఎంత మొనగాడు కంపెనీ అన్న విషయం పనామా పేపర్స్ కుంభకోణం బయటకు వచ్చాక కానీ అర్థం కాలేదు. చట్ట విరుద్ధమైన పనుల్ని తాము అస్సలు చేయలేదని చెబుతున్న ఈ కంపెనీ.. చివరకు తమకు సంబంధించిన సమాచారం బయటకు ఎలా వచ్చిందన్న విషయాన్ని బయటపెట్టింది. తమకు చెందిన సర్వర్లు పాక్షికంగా హ్యాక్ అయ్యాయన్నది ఒప్పుకుంది.

ఈ కంపెనీకి చెందిన 1.15కోట్ల పత్రాల్ని పరిశోధాత్మక జర్నలిస్టుల కన్సార్టియం ఒకటి బయట పెట్టటం తెలిసిందే. కంపెనీకి చెందిన సర్వర్ ను కాస్త హ్యాక్ చేస్తేనే ఇంత భారీగా సమాచారం బయటకు వచ్చి.. ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైతే.. ఈ కంపెనీకి చెందిన గుట్టుమట్లన్నీ బయటకు వస్తే పరిస్థితేంది? అన్న సందేహం కలగక మానదు. మొసాక్ ఫోన్సెకా కంపెనీ సర్వర్ ను మొత్తంగా విశ్లేషిస్తే.. ప్రపంచం ఏమవుతుందో..?