Begin typing your search above and press return to search.

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా 'పాల్వాయి'?

By:  Tupaki Desk   |   25 Aug 2022 2:30 PM GMT
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి?
X
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల విషయంలో ఆ పార్టీ కసరత్తు ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ లకు ఇప్పటికే అభ్యర్థి విషయంలో క్లారిటీ రాగా.. కాంగ్రెస్ కు మాత్రం కరువయ్యారు. బలమైన అభ్యర్థి కోసం వేట మొదలైంది.

ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ గాంధీ భవన్ లో మునుగోడు ఆశావహుల సమావేశం నిర్వహించారు. ఆశావహులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ భేటి అయ్యారు. వారి నుంచి వ్యక్తిగత అభిప్రాయాలు తెలుసుకున్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా సమష్టిగా పనిచేయాలని నేతలకు సూచించారు. ఈ సమావేశంలో పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్ తోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

అనంతరం హైదర్ గూడ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆశావహులతో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ భేటి అయ్యారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కమ్ ఠాగూర్ తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ సమావేశం అయ్యారు. టికెట్ ఎవరికి ఇవ్వలన్న దానిపై చర్చించారు. అభ్యర్థుల బలాబలాలు, బలహీనతలపై ఏఐసీసీకి పీసీసీ పంపనుంది. ఆ తర్వాత ఏఐసీసీ నుంచి అభ్యర్థి పేరు అధికారికంగా రానుంది.

కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. రాజీనామాను స్పీకర్ ఆమోదం తెలిపారు. దీంతో మునుగోడు స్థానం ఖాళీ అయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి శాసనసభ కార్యదర్శి తెలియజేశారు. త్వరలో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీతోపాటు మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

ఈ నేపథ్యంలో మునుగోడుకు సైతం ఎన్నిక జరుగనున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనివిధంగా త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీచేయనున్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే పేర్లు ఖరారు కానున్నాయి.

ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశాయి. త్వరలోనే కాంగ్రెస్ సైతం మీటింగ్ పెట్టనుంది. సభలో ఆ పార్టీ అగ్రనేతలు ప్రియాంక గాంధీతోపాటు పలువురు పాల్గొననున్నారు.