Begin typing your search above and press return to search.

కేసీఆర్ కొత్త స్కెచ్..అధ్యక్షుడిగా రెడ్డి నేత‌!

By:  Tupaki Desk   |   4 Jan 2017 7:57 AM GMT
కేసీఆర్ కొత్త స్కెచ్..అధ్యక్షుడిగా రెడ్డి నేత‌!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌కు శ్రీ‌కారం చుట్టార‌ని అంటున్నారు. రాజకీయ ప‌రిణామాల‌ను ముంద‌స్తుగా ఊహించ‌డంలో పెట్టింది పేర‌యిన కేసీఆర్ ఈ క్ర‌మంలో త‌న బ‌దులుగా పార్టీ ర‌థ‌సార‌థిగా రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌ను ఎన్నుకోనున్న‌ట్లు స‌మాచారం. గతంలో తెర‌మీద‌కు వ‌చ్చిన పార్టీ సీనియ‌ర్ నేత‌ - రాష్ట్ర హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి వ‌యోభారం రీత్యా స‌రైన వ్య‌క్తి కాద‌ని భావించిన కేసీఆర్‌...పార్టీకి ఆర్థికంగా అండ‌దండ‌లు అందించిన ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి టీఆర్ ఎస్ అధ్య‌క్షుడిగా నియ‌మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.ఈ మేర‌కు వ‌చ్చే ఏప్రిల్ లో జ‌రిగే పార్టీ స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌క‌టిస్తార‌ని అంటున్నారు.

తెలంగాణలో రెడ్డి ప్రాబల్యం పెరిగిపోవ‌డం - జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం - టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి - కాంగ్రెస్ ప‌క్ష‌నేత జానారెడ్డిల దూకుడు నేప‌థ్యంలో కేసీఆర్ ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో రెడ్డిల నుంచి వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కోవ‌డం - ఒకే వ్య‌క్తి రెండు ప‌ద‌వుల‌ను చేప‌ట్ట‌డం స‌రికాదు అనే విమ‌ర్శ రాకుండా చూడటంలో భాగంగా పార్టీ అధ్య‌క్షుడిగా కొత్త నేత‌ను కేసీఆర్ ఎన్నుకోనున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో పార్టీలో క్రియాశీలంగా ప‌నిచేయ‌డమే కాకుండా ఆర్థికంగా అండ‌దండ‌లు అందించిన ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డికి ఈ బాధ్య‌త‌లు ఇవ్వ‌నున్న‌ట్లు టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెప్తున్నాయి. వ‌రంగ‌ల్ జిల్లా వాసి అయిన ప‌ల్లా న‌ల్ల‌గొండలో రాజ‌కీయంగా ప‌ట్టు సాధించారు. అనురాగ్ విద్యాసంస్థ‌ల పేరుతో ఆయ‌న‌కు ఎడ్యుకేష‌న్ కాలేజీలు ఉన్నాయి. కేసీఆర్‌ కు న‌మ్మిన‌బంటు. ఈ నేప‌థ్యంలోనే త‌న స్థానాన్ని ప‌ల్లాతో భ‌ర్తీ చేసేందుకు గులాబీ ద‌ళ‌ప‌తి సిద్ధ‌మ‌యిన‌ట్లు టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెప్తున్నాయి.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/