Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ ఇన్‌...మన్నార్ గుడి మాఫియా ఔట్‌

By:  Tupaki Desk   |   22 Aug 2017 6:09 AM GMT
ర‌జ‌నీ ఇన్‌...మన్నార్ గుడి మాఫియా ఔట్‌
X
అన్నాడీఎంకేలోని రెండు కూట‌ములు విలీనం అవ‌డంతో ఇప్పుడు వాట్ నెక్ట్స్ అంటూ మన్నార్‌ గుడి మాఫియా సార‌థిగా పేరొందిన చిన్న‌మ్మ శ‌శిక‌ళ వైపు చూస్తున్నారు. అమ్మ జయలలిత మృతితో అందలం ఎక్కుతుందనుకున్న శశికళ అక్రమాస్తుల కేసులో జైలుపాలయ్యారు. జయలలిత సహాయకురాలిగా తప్ప మరే ఇతర పదవి గతంలో నిర్వహించని శశికళ జయ మృతితో ఒక్కసారిగా అధికారానికి దగ్గరయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై తమిళ సీఎం పదవికి చేరువయ్యారు. ఆ తర్వాత పార్టీ శాసనసభా పక్షనేతగా ఎన్నికై సీఎం పదవికి అర్హత సంపాదించారు. కానీ ప్రమాణస్వీకారం జరిగేలోపు అక్రమాస్తుల కేసు ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. సమీపబంధువు దినకరన్‌ కు పార్టీ పగ్గాలు - తన వర్గీయుడుగా భావించిన పళనిస్వామికి ప్రభుత్వ పగ్గాలు అప్పగించి జైలుకు వెళ్లారు.

అయితే చిన్న‌మ్మ జైలుకు వెళ్లిన అనంత‌రం మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం వర్గీయులు ఎగురేసిన తిరుగుబాటు బావుటా ఆమె పాలిట ఉచ్చులా మారింది. శశికళను - ఆమెను నీడలా వెన్నంటి ఉంటూ చక్రం తిప్పే మన్నార్‌ గుడి మాఫియాను దూరం పెట్టడం విలీనానికి షరతులుగా పన్నీర్‌ వర్గం ముందుకు తెచ్చింది. ఇటీవలే పళనిస్వామి వర్గం పన్నీర్‌ సెల్వం వర్గం డిమాండ్ మేరకు దినకరన్‌ ను బాధ్యతల నుంచి తప్పించింది. ఇప్పుడు విలీనం జరిగిపోయింది కనుక ప్రధాన డిమాండ్ అయిన శశికళ తొలగింపుపై రెండు వర్గాలు దృష్టి పెట్టబోతున్నాయి. శశికళను - ఆమె మన్నార్‌ గుడి మాఫియాను పక్కన పెట్టడం ఒక్కటే మిగిలిందని అంటున్నారు. అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పదవి నుంచి శశికళను తప్పించేందుకు త్వరలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు సీనియర్ నేత - రాజ్యసభ సభ్యుడు ఆర్ వైదిలింగం ప్రకటించారు. సర్వసభ్య సమావేశం ఆమెను ప్రధాన కార్యదర్శిగా నియమించింది కనుక తొలగింపు కూడా సర్వసభ్య సమావేశంలోనే జరుగాలనేది పార్టీ నేతల అభిప్రాయం.

మ‌రోవైపు తమిళ సూపర్‌ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని రచయిత తమీజరువి మనీయన్ చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని రజనీకాంత్ నిర్ణయించుకున్నట్లు చెప్పారని తెలిపారు. డీఎంకే - అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ ఉంటుందన్నారు. రజనీకాంత్ స్వచ్ఛమైన - మంచి పాలన అందిస్తారన్నారు. రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందించడమే రజనీ లక్ష్యమని చెప్పారు. గత 20 ఏళ్లుగా రజనీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారన్నారు.