Begin typing your search above and press return to search.

అమ్మను ‘ఆంటీ’నే ఐఏఎస్ పై పళని వేటు

By:  Tupaki Desk   |   8 March 2017 10:07 AM GMT
అమ్మను ‘ఆంటీ’నే ఐఏఎస్ పై పళని వేటు
X
అమ్మ ఎంత పవర్ ఫుల్ అన్నది అందరికి తెలిసిందే. అమ్మ దగ్గరకు వెళ్లటమే ఎక్కువ. వెళ్లిన తర్వాత ఆమె సేవకుడిగా మారటమే తప్పించి.. ఆమెకు సన్నిహితంగా వ్యవహరించటం.. చనువుగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. కొమ్ములు తిరిగి మగమహారాజులు మొదలు.. సింగిల్ హ్యాండ్ తో చక్రం తిప్పే మహిళామణులంతా కూడా అమ్మ దగ్గరకు వచ్చేసరికి ఆచితూచి వ్యవహరించాలే కానీ..కాస్తంటే కాస్త కూడా ఎక్కువ చేయటానికి లేదు. ఒకవేళ అలా చేస్తే.. మరుక్షణం శంకరగిరి మాన్యాలు పట్టటమే.

అంత కరుకుగా వ్యవహరించే అమ్మకు అత్యంత సన్నిహితంగా ఉండటమే కాదు..అమ్మను ముద్దుగా ‘ఆంటీ’ అని పిలిచే ఏకైక మహిళా ఐఏఎస్ అధికారిణిగా సబితను చెబుతారు. తమిళనాడు విద్యాశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. దాదాపు ఆరేళ్ల పాటు ఇదే పదవిలో ఉన్న ఆమెకు షాకిస్తూ.. చిన్నమ్మ విధేయుడు పళనిస్వామి ఆమె పదవిని మార్చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది తమిళనాడు రాజకీయ.. అధికారవర్గాల్లో పెను సంచలనంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. విద్యాశాఖకు మంత్రులు మారినా.. ఈ శాఖ కార్యదర్శిగా ఉన్న సబిత పొజిషన్ మాత్రం మారేది కాదు.

అమ్మ దగ్గర సబితకు ఉన్నచనువు పుణ్యమా అని ఐఏఎస్ అధికారులు సైతం ఆమెను ‘మేడమ్’ అని పిలిచే వారు. ఆమె అంటే హడలిపోయేవారు. దీనికి తగ్గట్లే అమ్మ దగ్గర తనకున్న చనువుతో చెలరేగిపోయేవారు. అంతా తనదే రాజ్యమన్నట్లుగా వ్యవహరించేవారు. చివరకు సమీక్షలు సైతం తన ఛాంబర్లోనే ఏర్పాటు చేశారు. అలాంటి ఆమెను.. తాజాగా పళనిస్వామి బదిలీ వేటు వేయటం.. సిమెంట్ సంస్థ ఎండీగా మార్చటం ఇప్పుడు సంచలనంగా మారింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకటి తర్వాత ఒకటిగా మార్పులు చేస్తున్న పళని స్వామి.. 17 మంది ఐఏఎస్ లు బదిలీ చేశారు. ఈ మార్పుల్లో సబితను టచ్ చేయరని అందరూ అనుకున్నారు. అందుకు భిన్నంగా ఆమెకు స్థానభ్రంశం కలిగేలా నిర్ణయం తీసుకోవటం చూస్తే.. అమ్మతోనే ఆమె ప్రభ ముగిసినట్లేనన్న వాదన వినిపిస్తోంది. తనకున్న ‘పవర్’తో చెలరేగిపోయిన సబితకు రానున్నరోజుల్లో మరిన్ని గడ్డు రోజలు తప్పవన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/