Begin typing your search above and press return to search.

పాక్‌ కు భార‌త్ భ‌యం...అందుకే ఈ ఏర్పాట్లు

By:  Tupaki Desk   |   24 Feb 2019 12:25 PM GMT
పాక్‌ కు భార‌త్ భ‌యం...అందుకే ఈ ఏర్పాట్లు
X
పొరుగుదేశం పాకిస్థాన్ ప‌రిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న‌ట్లుగా మారింది. పుల్వామా దాడి తర్వాత ఇండియా ఎక్కడ తమపై దాడికి వస్తుందో అని పాకిస్థాన్ భయపడుతోంది. భారత్ దాడి చేస్తే తామూ గట్టిగానే తిప్పికొడతాం అని పైకి చెబుతున్నా.. లోలోపల మాత్రం వణికిపోతోంది. పుల్వామా దాడి తర్వాత భారత భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ప్రధాని మోదీ చెప్పడంతో సర్జికల్ స్ట్రైక్స్ లాంటి దాడులు మరోసారి జరుగుతాయన్న ఆందోళన పాకిస్థాన్‌ లో ఉంది. ఇందుకు నిద‌ర్శ‌న‌మే తాజా ఉదాహ‌ర‌ణ‌.

పుల్వామా దాడిలో 40 మంది సీర్పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడి తమ పనే అని పాకిస్థాన్‌ కు చెందిన జైషే మమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే, భార‌త్ హెచ్చ‌రిస్తున్న‌ప్ప‌టికీ..మేక‌పోతు గాంభీర్యం ప్ర‌క‌టిస్తున్న పాక్ తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మొన్నటికి మొన్న పీఓకేలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న వాళ్లకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన పాక్... తాజాగా సంక్షోభ నిర్వహణ కేంద్రం (క్రైసిస్ మేనేజ్‌మెంట్ సెల్) ఏర్పాటు చేసింది. విదేశాంగ శాఖలో ఈ సెల్‌ ను ఏర్పాటు చేశారు. సంబంధిత వ్యక్తులకు ఈ సెల్ ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తుంది. సరిహద్దులో పరిస్థితులు, దౌత్యపరంగా సంప్రదించాల్సిన వ్యక్తుల వివరాలను ఈ సెల్ అందిస్తోంది. వారం రోజుల పాటు నిర్విరామంగా ఈ సెల్ పని చేయనుంది.