Begin typing your search above and press return to search.

కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన పాక్ కెప్టెన్ బాబ‌ర్ !

By:  Tupaki Desk   |   30 Oct 2021 8:34 AM GMT
కోహ్లీ  రికార్డును బద్దలుకొట్టిన పాక్ కెప్టెన్ బాబ‌ర్ !
X
టీ20 ప్రపంచకప్‌ లో పాకిస్థాన్ అద్భుతంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్ సార‌థ్యంలో ఆ దేశ ఆట‌గాళ్లు ఈ ప్ర‌పంచ క‌ప్ బ‌రిలోకి దిగారు. టీ20 ఫార్మాట్‌ లో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి సంబంధించిన ఓ రికార్డును బాబ‌ర్ బద్దలుకొట్ట‌డం గ‌మ‌నార్హం. నిన్న ఆఫ్ఘ‌నిస్థాన్‌ తో జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి గ్రూప్‌-2 లో వరుసగా మూడు మ్యాచ్‌ లు గెలుపొందిన జట్టుగా నిలిచింది. బాబర్‌ అజామ్ 51 ప‌రుగులు పూర్తి చేసి టీ20 క్రికెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆడిన‌ 26వ ఇన్నింగ్స్ లోనే అత‌డు 1,000 ప‌రుగులు పూర్తి చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ రికార్డును కోహ్లీ 30 ఇన్నింగ్సుల్లో పూర్తి చేశాడు. దీంతో కోహ్లీ రికార్డును బ‌ద్దలు కొట్టిన క్రికెట‌ర్ గా బాబ‌ర్ నిలిచాడు. కోహ్లీ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫా డుప్లెసిస్‌ (31 ఇన్నింగ్సుల్లో), ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్ (32 ఇన్నింగ్సుల్లో), న్యూజిలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (36 ఇన్నింగ్సుల్లో)ల‌ను బ‌ద్దలు కొట్టాడు. ఇప్పుడు కోహ్లీ రికార్డును బాబ‌ర్ అధిగ‌మించాడు. కాగా, ఆఫ్ఘ‌నిస్థాన్ బౌల‌ర్ రషీద్‌ ఖాన్ కూడా టీ20ల్లో రికార్డు నెలకొల్పాడు. నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో ర‌షీద్ ఖాన్‌.. రెండు వికెట్లు తీసిన అనంత‌రం అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెల‌కొల్పాడు.

అంత‌కుముందు శ్రీలంక మాజీ బౌల‌ర్ లసిత్‌ మలింగపై 76 ఇన్నింగ్సుల్లో 100 వికెట్లు తీసిన ఘ‌న‌త ఉంది. రషీద్ ఖాన్ ఆ రికార్డును 53 ఇన్నింగ్సుల్లోనే సాధించాడు. అలాగే, న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ (82 ఇన్నింగ్సుల్లో), బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ (83 ఇన్నింగ్సుల్లో) 100 వికెట్లు తీశారు. వారు ప్ర‌స్తుతం మూడు, నాలుగు స్థానాల్లో కొన‌సాగుతున్నారు. అంతేగాక‌, రషీద్ ఖాన్ వన్డేల్లోనూ అతి తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఇప్ప‌టికే రికార్డు నెల‌కొల్పాడు. మూడేళ్ల క్రితం 44 ఇన్నింగ్సుల్లోనే అత‌డు ఈ రికార్డు నెల‌కొల్పాడు.

ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ లు ఆడిన ఆ టీమ్ అన్నింటిలో విజయకేతనం ఎగురవేసి ఆరు పాయింట్లను సాధించింది. రెండో స్థానంలో ఆప్ఘనిస్తాన్ జట్టు ఉంది. ఇదే గ్రూప్‌ లో ఉన్న టీమిండియా ఇప్పటివరకు పాయింట్ల ఖాతా తెరవలేదు. మన జట్టు ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడగా అందులో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఆదివారం టీమిండియాకు కీలక మ్యాచ్ జరగనుంది. బలమైన న్యూజిలాండ్‌ జట్టును కోహ్లీ సేన ఢీకొట్టనుంది.