Begin typing your search above and press return to search.

హమ్మయ్యా.. మోదీకి పాక్ మద్దతు పలికిందబ్బా

By:  Tupaki Desk   |   14 March 2020 3:30 PM GMT
హమ్మయ్యా.. మోదీకి పాక్ మద్దతు పలికిందబ్బా
X
దాయాదీ దేశం పాకిస్థాన్ వ్యూహం అంతా... ఏ విషయంలో అయినా, ఎలాగైనా భారత్ ను వ్యతిరేకించి తీరాలనే. అంతేనా... వీలయితే ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ ను దోషిగా నిలబెట్టడంతో పాటు భారత్ లో అల్లర్లు పెచ్చరిల్లేలా చేయడమే పాక్ పని. అలాంటిది ఇప్పుడు భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ఓ విషయానికి పాక్ మద్దతు తెలిపింది. అంతేనా... ఈ విషయంలో మోదీ కలిసి చర్చించేందుకు కూడా పాక్ సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ మేరకు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇషా ఫరూకీ ఆసక్తికర ప్రకటన చేశారు.

అయినా మోదీ ఏం ప్రతిపాదించారు? దానిని పాక్ ఏ రీతిన స్పందించింది? అన్న వివరాల్లోకి వెళితే... ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఓ ఉమ్మడి వ్యూహం తో ముందుకు సాగాలని ప్రధాని మోదీ.. సార్క్ దేశాలకు పిలుపునిచ్చారు. కరోనాను నిలువరించేందుకు సార్క్ దేశాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేయాలని, ఈ విషయంలో సార్క్ దేశాలు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలవాలని కూడా మోదీ పిలుపునిచ్చారు. మోదీ నుంచి ఈ పిలుపు రాగానే పాకిస్థాన్ సానుకూలంగా స్పందించింది. అంతేకాకుండా ఈ దిశగా మోదీ ప్రతిపాదించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాలుపంచుకునేందుకు కూడా పాక్ అంగీకరించింది. ఈ భేటీలో పాక్ తరఫున ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్సెషల్ అసిస్టెంట్ జాఫర్ మీర్జా పాల్గొంటారని కూడా ఫరూకీ తెలిపారు.

ఇతర ప్రపంచ దేశాల మాదిరిగానే పాక్ కూడా కరోనా పేరు వింటేనే భయపడుతోంది. ఇప్పటిదాకా పాక్ లో కరోనా వైరస్ 22 మందికి సోకిందట. వారిలో ఇప్పటిదాకా ఓ వ్యక్తి కోలుకోగా.. మిగిలిన 21 మంది చికిత్స పొందుతున్నారు. ఈ గణాంకాలను చూస్తుంటే... ఇతర దేశాల కంటే కరోనా వ్యాప్తి పాక్ లో చాలా తక్కువగానే ఉన్నట్లు లెక్క. భారత్ పరిస్థితి కూడా ఇంచూమించూ అంతే ఉంది. ఈ నేపథ్యంలో సార్క్ దేశాలు ఉమ్మడిగా వ్యూహాలు రచించి కరోనాను నిలువరిద్దామని మోదీ ప్రతిపాదించగానే... అందుకు పాక్ సానుకూలంగా స్పందించడం, మోదీతో భేటీకి సిద్ధమని ప్రకటించడం గమనార్హం.