Begin typing your search above and press return to search.

ఈసారి పద్మాలు 128.. తెలుగు వారెవరు? ఏ రాష్ట్రానికి ఎన్ని?

By:  Tupaki Desk   |   26 Jan 2022 4:31 AM GMT
ఈసారి పద్మాలు 128.. తెలుగు వారెవరు? ఏ రాష్ట్రానికి ఎన్ని?
X
భారత గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రకటన వెలువడింది. ఆనవాయితీ తప్పకుండా మంగళవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో పద్మ వార్డులకు సంబంధించిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈసారి మొత్తం 128 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీనికి సంబంధించిన అధికారికంగా ప్రకటించారు. పద్మ అవార్డుల్లో అత్యున్నత పురస్కారంగా చెప్పే పద్మవిభూషణ్ ఈసారి నలుగురికి వరించగా.. పద్మభూషణ్ ను 17 మందికి ప్రకటించారు. మిగిలిన 107 మందికి పద్మశ్రీ అవార్డుల్ని ప్రకటించారు.

ఈసారి పద్మ అవార్డులు ప్రకటించిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు మొత్తం ఏడుగురు ఉన్నారు. వారిలో ఏపీకి చెందిన ముగ్గురు ఉంటే.. తెలంగాణకు చెందిన వారు నలుగురు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తెలంగాణలో పద్మ పురస్కారం వరించిన నలుగురిలో భారత్ బయోటెక్ అధినేతలు క్రిష్ణ ఎల్ల.. సుచిత్ర ఎల్ల దంపతులకు ఉమ్మడిగా పురస్కారాన్ని ప్రకటించారు.మరో అంశం ఏమంటే.. తెలంగాణలో పద్మశ్రీ పురస్కారం పొందిన నలుగురిలో ఇద్దరి మూలాలు ఏపీకి చెందిన వారు కావటం గమనార్హం.

తెలుగు సినిమా రంగానికి సంబంధించి అలనాటి సీనియర్ నటి షావుకారు జానకికి పద్మశ్రీ పురస్కారం వరించినా.. అది తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆమె ఎప్పటినుంచో తమిళనాడులోని చెన్నైలోనే స్థిరపడటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పద్మ పురస్కారాలు లభించిన వారిని చూస్తే..

తెలంగాణ

1. క్రిష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల – భారత్ బయోటెక్ (ఉమ్మడిగా) (పద్మభూషణ్)
2. దర్శనం మొగిలయ్య – కళలు (పద్మశ్రీ)
3. రామచంద్రయ్య – కళలు (పద్మశ్రీ)
4. పద్మజా రెడ్డి – కళలు (పద్మశ్రీ)

ఆంధ్రప్రదేశ్

1. గరికపాటి నర్సింహారావు – సాహిత్యం/విద్య (పద్మశ్రీ)
2. గోసవీడు షైక్ హుస్సేన్ – సాహిత్యం/విద్య (పద్మశ్రీ)
3. డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణ రావు – మెడిసిన్ (పద్మశ్రీ)
పద్మ పురస్కారాల్లో అత్యున్నతమైన పురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారాల విషయానికి వస్తే..ఈసారి నలుగురికి దక్కింది. ఈ నలుగురిలో ప్రభా ఆత్రే (కళాకారుడు) మినహా మిగిలిన ముగ్గురికి మరణాంతర పురస్కారాన్ని ప్రకటించారు. పద్మ భూషణ్ విషయానికి వస్తే.. మొత్తం 17 మందికి దక్కింది. అందులో పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్.. సత్య నాదెళ్ల.. సుందర్ పిచాయ్ లాంటి ప్రముఖులు ఉన్నారు.

పద్మ విభూషణ్

1. ప్రభా ఆత్రే - కళలు
2. రాధేశ్యామ్ కేంహ (సాహిత్యం) (మరణానంతరం)
3. జనరల్ బిపిన్ రావత్ (సివిల్ సర్వీస్) ( మరణానంతరం)
4. కల్యాణ్ సింగ్ (పబ్లిక్ అఫైర్స్) (మరణానంతరం)

పద్మవిభూషణ్ పురస్కారం ఏ రాష్ట్రాల వారికి దక్కిందన్నది చూస్తే.. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరికి లభించగా.. మిగిలిన రెండు ఉత్తరాఖండ్ కు చెందిన వారు ఒకరు.. మహారాష్ట్రకు చెందిన వారు ఒకరున్నారు. పద్మ భూషణ్.. పద్మశ్రీ పురస్కారాలకు సంబంధించి రాష్ట్రాల వారీగా చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరికి ఈ పురస్కారం లభించగా.. మూడు పురస్కారాలు యూఎస్ కు చెందిన ప్రవాసభారతీయులకు లభించాయి. మెక్సికోజాతీయత పొందిన మరో ప్రవాస భారతీయుడికి పురస్కారం లభించింది. రాష్ట్రాల వారీగా వస్తే.. రెండేసి పురస్కారాలు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల వారికి లభించింది. జమ్ముకశ్మీర్, పంజాబ్, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారికి ఒక్కొక్కరికి చొప్పున పురస్కారం లభించింది.

పద్మశ్రీ పురస్కారం విషయానికి వస్తే.. (మొత్తం 107కు రాష్ట్రాల వారీగా ఎన్ని అన్నది చూస్తే)

5 అంతకంటే ఎక్కువ వచ్చిన రాష్ట్రాలు

- ఉత్తరప్రదేశ్ (9)
- తమిళనాడు (7)
- మహారాష్ట్ర (7)
- గుజరాత్ (6)
- ఢిల్లీ (5)
- హర్యానా (5)
- కర్ణాటక (5)
- ఒడిశా (5)
- మధ్యప్రదేశ్ (5)

2 - 4 పద్మ పురస్కారాలు లభించిన రాష్ట్రాలు

- పశ్చిమ బెంగాల్ (4)
- కేరళ (4)
- ఉత్తరాఖండ్ (3)
- పంజాబ్ (3)
- మణిపూర్ (3)
- రాజస్థాన్ (3)
- ఆంధ్రప్రదేశ్ (3)
- తెలంగాణ (3)
- గోవా (2)
- జమ్ముకశ్మీర్ (2)
- లద్ధాఖ్ (2)
- బిహార్ (2)
- అసోం (2)
- హిమాచల్ ప్రదేశ్ (2)

ఒక పురస్కారం మాత్రమే లభించిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు

- జార్ఖండ్
- పాండిచ్చేరి
- దాద్రానగర్ హవేలీ
- మెఘాలయ
- అరుణచల్ ప్రదేశ్
- మిజోరం
- జార్ఖండ్
- ఛండీగఢ్
- సిక్కిం
- నాగాలాండ్

పద్మపురస్కారాలు పొందిన విదేశీయుల విషయానికి వస్తే..

- పోలాండ్
- యూకే
- జపాన్
- ఐర్లాండ్
- థాయ్ లాండ్
- రష్యా

పద్మ పురస్కారాల్లో మరో అంశం ఈసారి వీటిని సొంతం చేసుకున్న వారిలో మహిళల సంఖ్య గౌరవ ప్రదంగా ఉందని చెప్పాలి. ఈసారి మొత్తం 128 అవార్డులను ప్రకటించగా.. అందులో అవార్డులు పొందిన వాళ్లలో 34 మంది మహిళలున్నారు. 10 మందిని విదేశీ, ఎన్నారై, పీఐఓ, ఓసీఐ విభాగంలో ఎంపిక చేసింది. 13 మందికి మరణానంతరం అవార్డులు ప్రకటించింది. ఇద్దరికి కలిపి ఒకే అవార్డును ఈసారి రెండు సందర్భాల్లో ఇచ్చారు. ఏమైనా మహిళలకు పెద్ద ఎత్తున పద్మ పురస్కారాలు వరించటం ఆసక్తికరమైన అంశంగా చెప్పక తప్పదు.